ఎందుకోగానీ.. గల్లా అరుణకుమారి టీడీపీలో ఇమడలేకపోతున్నారు.. పదవి దక్కకనో.. గత వైరమో తెలియదుగానీ.. కొద్దిరోజులుగా ఆమె స్వరం మార్చారు.. నాలుగేళ్లపాటు ఎదురుచూసినా ఆశలు నెరవేరకపోవడంతో తన రాజకీయ భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మళ్లీ సొంతగూడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా.. క్యాడర్ మాత్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి గల్లా అరుణకుమారి ఏం చేయబోతున్నారన్నదానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేతల్లో కొందరు మళ్లీ సొంతగూటికి చేరే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో గల్లా అరుణ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి మొదట్లో ఒకే జిల్లాకు చెందిన గల్లా అరుణకుమారి, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఈక్రమంలోనే వారి మధ్య రాజకీయ వైరం మొదలైంది. ఆ తర్వాత అరుణ కాంగ్రెస్ పార్టీలోనే ఉండగా.. చంద్రబాబు మాత్రం టీడీపీలోకి వెళ్లారు. పార్టీలు మారిన తర్వాత వైరం మరింతగా పెరిగింది. అయితే తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అరుణ రాణించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.
కానీ... రాష్ట్ర విభజన తర్వాత ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో.. రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గతంలో గెలిచిన చంద్రగిరి నుంచి తనకు, గుంటూరు లోక్సభ టికెట్ కుమారుడు జయదేవ్కు ఇప్పించుకున్నారు. కానీ..చంద్రగిరిలో ఆమె ఓడిపోయారు. గుంటూరు ఎంపీగా మాత్రం కుమారుడు జయదేవ్ విజయం సాధించారు. ఇదిలా ఉండగా... తనకు ఎమ్మెల్సీ పదవైనా చంద్రబాబు ఇస్తారని గల్లా అరుణ భావించారు. కానీ.. ఆ పదవిని అదే సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడికి కట్టబెట్టారు చంద్రబాబు. ఇక అప్పటి నుంచి గల్లా అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో తనకు అప్పగించిన పార్టీ నియోజకవర్గ పదవి వద్దని చెబుతన్నారు.
మరోవైపు కొద్దిరోజుల కిందట తన అనుచరగణంలో సమావేశం నిర్వహించి పార్టీ మారే విషయంపై చర్చించారు. కానీ.. అందుకు అనుచరులు ఒప్పుకోకపోవడంతో ఆమె వెనకడుగువేశారు. ఇదే సమయంలో ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. దీనిని వాళ్లు ఖండించినా అరుణ వియ్యంకుడు సూపర్స్టార్ కృష్ణ మధ్యవర్తిత్వం ద్వారా వైసీపీలోకి ఎప్పుడైనా వెళ్లొచ్చని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఈ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి.