పవర్ స్టార్పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. ఇంకా కన్నైనా తెరవలేని స్థితిలోనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఆశించిన మేరకు సభ్యత్వ నమోదు కూడా చేపట్టలేదు. కార్యకర్తలు, బూత్ స్తాయి నేతలు, కీలక ప్రతినిధులు, అధికారిక ప్రతినిధులు ఇలా ఏ ఒక్కరూ ఇప్పటి వరకు లేరు. కానీ, ఎక్కడికక్కడ గొడవలు మాత్రం జరుగుతున్నాయి. పోనీ.. ఈగొడవలైనా .. ఏపీ ప్రయోజనాల నేపథ్యంలో అధికార పక్షం నాయకులతో గొడవపడితే బాగుండేది. కానీ, అలాగూ జరగడం లేదు. ఎక్కడికక్కడ.. జనసేన నాయకులు తమలో తాము కొట్టుకుని పరువు తీసుకుంటున్నారు. పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు.
నిజానికి ఇప్పుడే పుట్టినపార్టీగా ఉన్న జనసేనకు ఇంకా పురుటి వాసన కూడా పోలేదు. అంతేకాదు, పవన కళ్యాణే చెప్పినట్టు కనీసం 25 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఇది. మరి అలాంటి పార్టీలో ఇప్పటికే ఘర్షణలు చోటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగాఆ ఎవరికి వారు నేతలు ఆధిపత్య ధోరణికి పోవడం వంటివి జనసేనకి మైనస్లుగా పరిణమించాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానని, పార్టీని అధికారంలోకి తెస్తానని పవన్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు, తాను ఎవరికి మద్దతిచ్చేది లేదని చెప్పారు. దీంతో పార్టీపై మరింత పెద్ద బాధ్యతే మీదపడింది.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పవన్ వైపు మళ్లించడం అనేది.. ఏ ఒక్కరివల్లో సాధ్యమయ్యే పనికాదు. అందుకే జనసేనకు కార్యకర్తలు, అభిమానులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ఆదిశగా పార్టలో ఏదైనా దిశానిర్దేశం జరుగుతోందా? అన్నది ప్రధాన ప్రశ్న. కొన్ని వర్గాల వారినే ప్రామాణికంగా తీసుకుని జనసేనాని అడుగులు వేస్తున్నాడు., అంతేకాదు. పార్టీలో క్రమశిక్షణ ఎక్కడా కనిపించదు. ఈ విషయంలో పవన్ కూడా ఎక్కడా శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కమాదిరిగా తయారైంది.
మరో పదిమాసాల్లోనే ఎన్నికలు ఉన్న తరుణంలో జనసేన అత్యంత ఉత్సాహంగా కదన రంగంలోకి దూకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా కూడా ఈ విషయంలో చాలా లైట్గానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు చిన్నపాటి గొడవలు, ఆధిపత్య ధోరణులతో రోడ్డెక్కితే.. పార్టీని నడిపించేవారు ఎవరుంటారు? పవన్ ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో జనసేనను ప్రజలకు చేరువ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.