భారతీయ యువత భారత్ లో గుర్తించబడకపోయినా, వారి నైపుణ్యం ఇప్పుడు విదేశాల్లో వెలిగిపోతుంది. ప్రపంచాన్ని తమ తమ రంగాల్లో శాసిస్తున్న బహుళ జాతి అమెరికన్ కంపెనీ లకు నాయకత్వం వహిస్తూ, పలువురు భారతీయులు, మన భారత ప్రతిష్టలను దిగంతాలకు, కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింప జేస్తున్నారు.
ఇప్పటికే గూగుల్ కు మార్గదర్శిగా ఉంటూ ప్రగతి పథంలో నడిపిస్తున్నారు భారత్ (చెన్నై) మూలాలున్న అమెరికన్ సుందర్ పిచాయ్, అలాగే మైక్రోసాఫ్ట్ కు దిశానిర్దేశం చేస్తున్న తెలుగువారు సత్య నాదెళ్ల, పెప్సి అధినేత్రి ఇంద్ర నూయి కూడా భారతీయ అమెరికనే. ఈ జాబితాలోకి మరో భారతీయ (చెన్నై) మూలాలున్న వనిత జాయినైంది.
మరో ప్రపంచ ప్రఖ్యాత కార్-మేకర్ - జనరల్ మోటార్స్, బైక్, కాడిలాక్, షవర్లీ కార్స్ — తయారీదారులు జూన్ 13న తమ తొలి మహిళా సి.ఎఫ్.ఓ - చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా ప్రవాస భారతీయురాలు, 39 యేళ్ళ దివ్యా సూర్యదేవరను నియమించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి అమెరికన్ ఆటోమొబైల్ రంగంలోనే అతిపెద్ద కంపెనీ అయిన జనరల్ మోటార్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ బాధ్యతలను ప్రస్తుత సీఎఫ్వో చెక్ స్టీవెన్స్ నుండి ఆమే స్వీకరించనున్నారు.
ఈ మేరకు జనరల్ మోటార్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నైకు చెందిన దివ్యా సూర్యదేవర — యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ నుంచి కామర్స్ విభాగంలో డిగ్రీ, పీజీ పట్టాలను అందుకుని, అనంతరం అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్శిటీ లో ఎంబీఏ చేశారు. అనంతరం యూబీఎస్, "ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్- పిడబ్ల్యూసి" సంస్థల్లో 'ఫైనాన్షియల్ ఎనలిస్ట్' గా సేవలందించి ఫైనాన్స్ రంగంపై ఆధిఖ్యత సాధించారు.
2005లో జనరల్ మోటార్స్లో చేరి వివిధ విభాగాలపై పట్టు సాధించారు. 2017 లో "వైస్ ప్రెసిడెంట్, కార్పోరేట్ ఫైనాన్స్" పదోన్నతి పొందారు. దివ్య నియాకం తరవాత జనరల్ మోటార్స్, అనేక కంపనీలతో చేతులు కలిపింది. అవే హెర్షే, సిగ్నెట్ (జెవెల్లర్స్). దివ్య సూర్యదేవర సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రపంచ నలుమూలల నుండి పలువురు భారతీయులు అభినందనలు తెలుపు తున్నారు.
ఇప్పటికే జనరల్ మోటార్స్ కంపెనీ సీఈవోగా 'మేరీ బర్రా' అనే మహిళే ఉన్నారు. అంతే కాకుండా హెర్షే కో, సిగ్నెట్ జ్యుయలర్స్ వంటి ప్రసిద్ధ కంపెనీలకు సీఈవో, సీఎఫ్ఓలుగా మహిళలే ఉన్నారు. ‘‘పెద్ద పెద్ద కంపెనీలన్నీ అత్యున్నత స్థాయి పదవుల్లో మహిళల్నే నియమించడం నిజంగా గర్వకారణం. ఇది సంబరాలు చేసుకునే సమయం’’ అని మహిళలు అత్యున్నత స్థాయికి వెళ్లడానికి శిక్షణనిచ్చే స్వచ్ఛంద సంస్థ సీనియర్ డైరెక్టర్ 'అన్నా బెనింగర్' వ్యాఖ్యానించారు.
పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీల్లో అత్యున్నత పదవులకు మహిళల నియామకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటిని చక్కదిద్ది నట్టే మహిళలు కంపెనీనీ సమర్థంగా నిర్వహిస్తారనే భావన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది.