రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎలాంటి వాతవరణం ఎదురవుతుందో? ఎవరు ఎలా మారతారో కూడా చెప్పడం కష్టం. అందుకే రాజకీయంగా వైరం ఉంటే.. తుదిశ్వాస వరకు పోదని! సాధారణ వైరాన్ని సంప్రదింపుల ద్వారా అయినా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, రాజకీయ వైరం మాత్రం అవకాశాన్ని కక్ష తీర్చుకుం టుందే తప్ప.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. నెల్లూరు రాజకీయాల్లో తమకు తిరుగులేదని భావించి, జిల్లా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారం చలాయించిన ఆనం సోదరుల్లో మిగిలిన రామనారాయణ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల ఆనం వివేకా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక, మిగిలిన రామనారాయణ రెడ్డి.. పరిస్థితి కుడితోపడిపోయిన ఎలిక మాదిరిగా తయారైంది.
2014లో రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆనం సోదరులు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్కు రూపు రేఖలు లేకుండా పోయాయి. దీంతో ఇద్దరూ వెంటనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడే వారు రాజకీయంగా రాంగ్ స్టెప్ వేశారని పొలిటికల్ విశ్లేషకులు అప్పట్లోనే కుండబద్దలు కొట్టారు. దీనికి ప్రధాన కారణం.. అటు రాజకీయంగా.. ఇటు వ్యాపార పరంగా తీవ్రమైన పోటీ ఇస్తున్న వారు, ఆనం సోదరులకు వ్యాపార పరంగా కూడా గిట్టని వారు కూడా అందరూ టీడీపీలోనే ఉన్నారు. దీంతో ఇక, వారు ఆనం సోదరులపై కక్ష తీర్చుకునేందుకు సరైన అవకాశం వచ్చినట్టుగా భావించారు. పైకి నవ్వుతూనే మాట్లాడినా.. కంఠంలో మాత్రం విషాన్ని పెంచుకున్నారు. సమయం కోసం సందర్భం కోసం ఎదురుచూశారు. ఇలాంటి వారిలో కీలకమైన నేత మంత్రి పొంగూరు నారాయణ!
నెల్లూరు సిటీ పరిధికి చెందిన మంత్రి నారాయణకు, ఆనం సోదరులకు ఆది నుంచి విద్యా వ్యాపార విషయమై ఘర్షణలు ఉన్నాయి. నెల్లూరు మునిసిపాలిటీని శాసించిన రోజుల్లో ఆనం వివేకానంద రెడ్డి.. నారాయణ విద్యాసంస్థల ఆస్తులపై కక్ష గట్టినట్టు మునిసిపల్ అధికారులతో ఆయా విద్యా భవనాలపై దాడులు చేయిస్తూ ఉండేవారు. ఇలా రానురాను ఆనం, నారాయణ సంస్థల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక, రాజకీయంగా ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోనూ ఆనం సోదరులు ఆది నుంచి ఘర్షణలు పడేవారు. ఈ పరిణామంతొ అటు నారాయణ, ఇటు సోమిరెడ్డి కూడా ఆనం సొదరులపై అవకాశం వచ్చినప్పుడు ఇరుకున పెట్టాలని భావించారు.
ఇక, 2014 ఎన్నికల తర్వాత ఆనం సోదరులు టీడీపీలోకి చేరడంతో అటు నారాయణ, ఇటు సోమిరెడ్డిలకు కూడా అందని అవకాశంగా మారిపోయింది. పార్టీలో మారే సమయంలో ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ అమలు కాకపోవడం, ఆనం సోదరులకు ప్రాధాన్యం లేకుండా పోవడం వెనుక వీరి స్వయంకృతమే! ఇక, రాజకీయంగా ఆనం సోదరులు ఎదిగితే.. తన ప్రభావానికి గండి పడుతుందని భావించిన ఆయన ఆనం సోదరులను రాజకీయంగా ఎదగకుండా, వారికి ఎలాంటి పదవుల దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పారని తెలుస్తోంది. ఇలా మొత్తంగా ఆనం కు రాజకీయంగా ఎదురైన అనేక సవాళ్లు, ప్రతిబంధకాలు స్వయంకృతమేనని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారుపరిశీలకులు.