ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం దేశంలో భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించిందా..? నేతల రూట్ మ్యాప్ను ఖరారు చేసిందా..? అంటే పలువురు రాజకీయ విశ్లేషకులు ఔననే అంటున్నారు. అంతేగాకుండా.. ఎవరెవరు కలిసి నడుస్తారు..? మోడీ జేబులో దూరేదెవరు..? తదితర ప్రశ్నలెన్నింటికో ఈ సమావేశం సందర్భంగా జవాబులు దొరకబుచ్చుకునే అవకాశం కలిగిందని చెబుతున్నారు. అయితే.. నీతి ఆయోగ్ సమాశానికి, రాజకీయ ముఖచిత్రానికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా..? ఇక్కడ విషయమేమిటంటే.. ఈ సమావేశానికి హాజరైన పలువురు ముఖ్యమంత్రుల కదలికలు వచ్చే సార్వత్రిక ఎన్నికల ముంగిట రాజకీయం ఎలా ఉండబోతుందో చేప్పేందుకు దోహదపడ్డాయని వారు భావిస్తున్నారు.
దేశంలో రోజురోజుకూ ప్రధాని మోడీ ప్రభ తగ్గిపోవడం.. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతానే ఊహాగానాలు వినిపించడం.. ఆ దిశగా పలువురు నేతలు ప్రకటనలు చేయడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రుల్లో ఐదుగురి కదలికలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ ఐదుగురు ఎవరంటే.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జేడీఎస్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఢిల్లీలో ఎల్జీ కార్యాలయంలో ధర్నా చేస్తున్న సీఎం కేజ్రీవాల్కు చంద్రబాబు, మమతాబెనర్జీ, విజయన్ మద్దతు తెలిపారు.
అయితే కేసీఆర్ మాత్రం కేజ్రీకి మద్దతు తెలుపలేదు. అదే సమయంలో గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కోల్కతా వెళ్లి మమతను కలిసి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశం సందర్బంగా ఆమెను కనీసం పలకరించకపోవడం గమనార్హం. అంతేగాకుండా.. చంద్రబాబు, కుమారస్వామితో కూడా ఆయన మాట్లాడలేదు. ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబుతో కూడా మాట్లాడుతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆంతర్యమేమిటన్నది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.
నిజానికి నీతి ఆయోగ్ సమావేశానికి ఒకరోజు ముందుగానే కేసీఆర్ మోడీతో భేటీ కావడంలో రాజకీయ అంశాలే ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు గులాబీ బాస్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఇలా వ్యవహరిండంపై విమర్శలు వచ్చిపడుతున్నాయి.