ప్రజాచైతన్య బస్సుయాత్రతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్గేమ్ ఆడుతున్నారా..? నాలుగేళ్లుగా లేని ముచ్చట కొద్దిరోజులుగా చక్కర్లు కొట్టడంలో ఆంతర్య మేమిటి..? ఉత్తమ్పై పలువురు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారని వార్తలు రావడంలో ఎవరి హస్తం ఉంది..? ఒక్కటిగా కదులుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో చిచ్చు పెట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు..? కాంగ్రెస్ పార్టీలో అప్పుడే లుకలుకలు.. బెకబెకలు మొదలయ్యాయని ఈ మధ్య జోరుగా ప్రచారం జరగడం వెనక ఎవరున్నారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి.
గత ఎన్నికల తర్వాత సుమారు రెండు మూడేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం నిండుకుంది. అప్పటివరకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పెద్దగా కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్నది కూడా లేదు.. అయితే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కాంగ్రెస్తోపాటు టీడీపీ తదితర పార్టీల నుంచి నేతలను గులాబీ గూటికి చేర్చుకున్నారు. ఇక కారు కిక్కిరిసిపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ ఆపేశారు. మరోవైపు గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నేతల్లో కదలిక మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదల రాష్ట్ర నేతల్లో వచ్చింది.
ఈ క్రమంలోనే ప్రజాచైతన్య బస్సుయాత్ర చేపట్టారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో మూడు విడతల్లో ప్రజాచైతన్య బస్సుయాత్రను విజయవంతంగా చేపట్టారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మరోవైపు టీడీపీ నుంచి కీలక నేత రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్లో జోష్ వచ్చింది. క్రమంలో వచ్చే ఎన్నికల్లో సత్తాచాటుతామన్న ధైర్యాన్ని క్యాడర్కు ఇవ్వడంలో ఉత్తమ్కుమార్రెడ్డి చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో నేతలందరూ కలిసికట్టుగా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పాకులాడుతున్నారనీ, గ్రూపులుగా విడిపోయారనీ, ఉత్తమ్తీరుపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. అంతేగాకుండా.. సీఎం కేసీఆర్కు ఉత్తమ్ సరెండర్ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఉత్తమ్ గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామంటూ కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పై ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా.. భట్టి విక్రమార్క నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారు.
అయితే.. వీరందరూ ఉత్తమ్పై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారంటూ మళ్లీ వార్తలు వచ్చాయి.. ఉత్తమ్ను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవనీ.. వారు తనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని తాను అనుకోవడం లేదని ఉత్తమ్ అంటున్నారు. మరోనేత మల్లు రవి కూడా 2019వరకు ఉత్తమ్ టీపీసీసీ చీఫ్గా కొనసాగుతారని అన్నారు.