ఎప్పుడూ శాంతంగా ఉండే ఆయన ఇప్పుడు చీటికీ మాటికీ కోప్పుడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా సమాధానాలిచ్చే ఆయన.. పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సాధారణ ప్రజలు, అధికారులు, కాంట్రాక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరితోనూ చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లూ ఓర్పుతో ఉన్న ఆయనేనా ఇలా వ్యవహరిస్తోంది అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకిలా? ఆయనకు ఏమైంది? అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలి చూసిన వారంతా అవాక్కవుతున్నారు. మొన్నటికి మొన్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా అంటూ బెదిరించిన తీరుతో టీడీపీ నాయకులే విస్తుపోతున్నారు. ముఖ్యంగా బీజేపీతో దోస్తీ కటీఫ్, మరో మిత్రుడు జనసేన అధినేత పవన్.. రివర్స్ అవ్వడం దగ్గర నుంచి బాబులో ఈ ఆవేశం పెరిగిపోయిందనే చర్చ మొదలైంది.
ఏ కష్టమొచ్చినా.. అండగా స్నేహితులు తోడుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ఎటువంటి కష్టాన్నైనా సమర్థంగా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకపక్క వరుసగా మిత్రులందరూ దూరమవుతుండటం.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఆందోళనస్థాయి అధికమవుతుంది. ఒంటరిగా మిగిలిపోతున్నానన్న వేదనకు తోడు.. సమస్యలు చుట్టుముడితే అందులోంచే ఆవేశం, ఆక్రోశం బయటపడతాయి! ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారంటున్నారు విశ్లేషకులు. కొంత కాలం నుంచి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు గమనించిన అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తప్పుకున్న రోజు ఆయన తీరు చూసి సీఎం పేషీలోని అధికారులు షాక్ కు గురయ్యారు.
పేషీలోని ఓ అధికారి ఢిల్లీలో ఉన్న ఓ కీలక నేతకు ఫోన్ చేసి `మీరు అయినా వచ్చి మాట్లాడండి. ఫుల్ సీరియస్ అవుతున్నారు. కోపాన్ని కంట్రోల్ చేయటం కష్టంగా ఉంద`ని సూచించినట్లు ఓ టీడీపీ నేత వెల్లడించారు. `ఆ తిప్పలు ఏదో మీరే పడండి. నేను రాలేను` అని ఆయన తేల్చిచెప్పటంతో దిక్కుతోచనిస్థితిలో పడిపోయారట. తాజాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్ల బృందం.. ఆయనతో భేటీకి ప్రయత్నించింది. గంటలు గడిచినా అపాయింట్ మెంట్ ఇవ్వని ఆయన వెళుతూ వెళుతూ.. `ఏంది మీరిక్కడ?` అని ప్రశ్నించటంతో ఆశ్చర్యానికి గురయ్యారట. ప్రభుత్వంలో తమ సంస్థలకు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పగానే ..ఓ అధికారిని పురమాయిస్తూ `ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు చూడండి` అంటూ వెళ్లిపోయారట.
తాజాగా నాయీ బ్రాహ్మణుల విషయంలో సచివాలయం రోడ్డుపై జరిగిన సీన్ తెలిసిందే. పార్టీ నేతలు కూడా సంస్థాగతంగా జరుగుతున్న పొరపాట్లు, లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తుంటే వారిపై కూడా చంద్రబాబు అంతెత్తున మండిపడుతున్నారట. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ చాలా మంది ఆయన మాటకు ఎదురు చెప్పడం లేదట. అసలు ఎలాంటి ఫిర్యాదులు కానీ, వాస్తవ పరిస్థితులను చంద్రబాబు ఏ మాత్రం రిసీవ్ చేసుకునే మూడ్ లో లేరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీతో పొత్తుకు దూరం కావటం, జనసేన అధినేత పవన్ తిరుగుబాటు నుంచి చంద్రబాబు రాజకీయంగా ఏపీలో టరయ్యారయ్యారని, అప్పటి నుంచే అధినేతలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందే చర్చ అటు అధికారులు.. ఇటు పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.