సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రధాని మోడీని సర్వేలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2014ఎన్నికల్లో ప్రభంజనం స`ష్టించిన మోడీ.. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రభ కోల్పోతున్నట్లు పలు సర్వేలు తేల్చాయి.. అంతెందుకు.. బీజేపీ సొంతంగా నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైనట్లు వార్తలు వచ్చాయి. గతంలో సొంతంగా గెలిచిన 282పార్లమెంటు స్థానాల్లో ఈసారి సగానికిపైగా సీట్లు కోల్పోవడం ఖాయమని వాదన కూడా మొదలైంది. తాజాగా... మరో సర్వే పిడుగు మోడీపై పడింది.
అయితే.. ఇది రాజకీయం అంశానికి సంబంధించినది కాదుగానీ... అంతకంటే ఎక్కువ మోడీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.. ఎందుకంటే.. మోడీ ఇచ్చిన నినాదం.. భేటీ బచావో.. భేటీ పడావో నినాదం.. ఏమీ పనిచేయలేదని తేలిపోయింది. మహిళలకు రక్షణ కల్పించడంలో మోడీ ఘోరంగా విఫలం చెందారని స్పష్టమైంది. మహిళలకు సంబంధించి ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సంప్రదాయ విధానాలు, లైంగిక, లైంగికేతర హింస, వేధింపులు, మానవ అక్రమరవాణావంటి అంశాలపై థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది.
గత మార్చి 26 నుంచి మే 4 మధ్య.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 548 మంది నిపుణులను ఆన్లైన్లో ఫోన్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుని సర్వే నిర్వహించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 193 దేశాల్లో ఏ ఐదు దేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకరమైనవని? అన్నకోణంలో ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. అయితే ఇందులో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ మారిందని ఈ సర్వే పేర్కొంది. ఇప్పుడీ అంశం దేశంలో హాట్ టాపిక్గా మారింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... నిత్యం అల్లకల్లోలంగా ఉండే అఫ్గనిస్తాన్, సిరియా వంటి దేశాల్లో కన్నా.. భారతదేశంలో మహిళల పరిస్థితి దయనీయంగా, దారుణంగా ఉందని ఈ సర్వే నివేదికలో పేర్కొన్నారు. మొదటి పది దేశాల్లో పాకిస్థాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమన్, నైజీరియాలతోపాటు అమెరికా కూడా ఉన్నట్లు పేర్కొంది. 2007 నుంచి 2016 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 83 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వ డేటా సూచిస్తోంది.
గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నట్లు అందులో తెలిపింది. అయితే, 2012లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళల రక్షణకు సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందినట్లు ఇప్పుడీ సర్వే ద్వారా తేలింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో పదహారేళ్ల బాలికపై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.