టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆయన వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. ముక్కుపుడక చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి దర్శించుకుని రేపు ఉదయం సుమారు పన్నెండు గంటల సమయంలో 15 తులాల బంగారు ముక్కుపుడకను సమర్పించనున్నారు. ముందుస్తు ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు వెళ్లి కనదుర్గమ్మకు మొక్కు చెల్లిస్తుండడం గమనార్హం.
అయితే కేసీఆర్ పర్యటనలో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా..? లేవా? అన్నది కేసీఆర్, చంద్రబాబు భేటీల ఆధారంగానే ఉంటుంది. అయితే.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన పలు ప్రాంతీయ పార్టీల నేతలు త`ణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతను, జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామి, డీఎంకే నేతలు కరుణానిది, స్టాలిన్, కనిమొళితో భేటీ అయిన విషయం విదితమే.
అయితే తమిళనాడులో కరుణానిధి, స్టాలిన్తో భేటీ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతుండగా.. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలుస్తారా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కలుస్తానని కేసీఆర్ బదులిచ్చారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడనీ, ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్నామనీ, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తప్పకుండా చంద్రబాబుతో కూడా సంప్రదింపులు జరుపుతామని కేసీఆర్ ఆరోజు మీడియా ముఖంగా ప్రకటించారు.
అయితే...కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించేందుకు విజయవాడకు వస్తున్న సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారా... లేదా ? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ ఇద్దరు చంద్రులు భేటీ అయితే ఏయే అంశాలు చర్చకు వస్తాయన్న దానిపై కూడా ఇప్పటి నుంచే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం టీడీపీ రాజ్యసభ్య సభ్యుడు సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలకు కేసీఆర్ మద్దతు ఇస్తారా...? లేదా అన్నది కీలకంగ చర్చకు వస్తోంది. గతంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదేమైనా.. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే.