టీడీపీలో ఆసక్తికర మైన చర్చ సాగుతోంది. తాను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానంటూ.. మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగాఆయన టీడీపీకి పట్టున్న ప్రాంతాల నుంచే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతలు ఎవరికి వారుగా తమ తమ స్థానాలను త్యాగం చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆ నియోజకవర్గాలేంటి? ఆ నేతలు ఎవరు? అనే విషయాన్ని పరిశీలిద్దాం. టీడీపీకి పట్టున్న అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచే దాదాపుగా లోకేష్ పోటీ చేయనున్నట్లు తెలిసింది.
ప్రధానంగా మంత్రి అమరనాథరెడ్డి నియోజకవర్గమైన పలమనేరు నుంచి గానీ.. టీడీపీ బలంగా ఉన్న కృష్ణా జిల్లాలోని పెనమలూరు నుంచి గానీ లోకేష్ పోటీ చేస్తారనే సరికొత్త ప్రచారం తెరపైకొచ్చింది. ఒకవేళ ఈ రెండు నియోజకవర్గాలు కాకపోయినప్పటికీ ఈ రెండు జిల్లాల నుంచి మాత్రం ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మాత్రం టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. పలమనేరు విషయానికొస్తే.. గతంలో కుప్పం పరిధిలో ఉన్న కొన్ని మండలాలు పలమనేరు నియోజకవర్గంలో కలవడం టీడీపీకి కలిసొచ్చే అంశం. మొదటి నుంచి.. ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. ఇవి మాత్రమే కాదు.. కృష్ణా, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల పేర్లు కూడా లోకేష్ పోటీ చేయనున్నారనే జాబితాలో ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే తమ సీట్లు త్యాగం చేసేందుకు గతంలో ఇద్దరు మంత్రులు ముందుకొచ్చారు. ఒకరు మంత్రి అమర్నాథరెడ్డి కాగా.. మరొకరు మంత్రి గంటా శ్రీనివాసరావు. వీరిద్దరూ లోకేష్ కోసం తమ నియోజకవర్గాలను వదులుకొనేందుకు సిద్ధపడ్డారు. లోకేష్ పోటీ చేస్తానంటే.. తన స్థానాన్ని వదులుకుని పుంగనూరు నుంచి బరిలోకి దిగాలనేది అమర్నాథరెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. ఇక గంటా విషయానికొస్తే.. నియోజకవర్గం మారితే గెలుపు తథ్యం అనే సెంటిమెంట్ ఉంది.
2004లో చోడవరం నుంచి పోటీ చేసి గెలిచిన గంటా... 2009లో పీఆర్పీ తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గంటా.. తాను ఎక్కడినుంచి పోటీ చేసినా.. గెలుస్తానని, అందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని త్యాగం చేసేందుకు వెనుకాడాల్సిన అవసరం లేదని అంటున్నారు. లోకేష్ కోసం సీటును వదులుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంపై అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకూ సస్పెన్స్ కొనసాగనుంది.