వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించాడుగానీ.. దీని చుట్టూ అనేక సందేహాలు పొలిటికల్ సర్కిల్లో చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి. ఒంటరిగానే పోటీచేస్తాడా లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడా అనేది ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్-వైసీపీ అధినేత జగన్ కలిసిపోవడం ఖాయమని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించక పోవడం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఒక విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగానే పోటీచేస్తామని తేల్చిచెప్పేశాడు. ఈ నేపథ్యంలో పవన్ ఎటువైపు అడుగులేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే జనసేన మాత్రం వైసీపీతో పొత్తు ప్రయత్నాల్లో ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ పార్టీకి కనీసం 30 సీట్లు ఇచ్చినా.. సగం కూడా గెలిచే పరిస్థితి లేకపోవడంతో పొత్తుకు అంతా సందేహాలు వ్యక్తంచేస్తున్నారట.
175 నియోజకవర్గాల్లో పోటీచేస్తే జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తుందనే ప్రశ్నకు బదులు దొరకడం చాలా కష్టమే! ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాలు, జిల్లాల్లో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయనే విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో పవన్ చరిష్మా, ఆయనకున్న సామాజికబలం, ఇతర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు ఒక 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపే అవకాశాలున్నాయి. అది కూడా గోదావరి జిల్లాలతో పాటు విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమేననేది విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి ఈసమయంలో ఆ పార్టీతో పొత్తు అంటే ఏ పార్టీ అయినా వెనకడుగు వేయాల్సిందేనని విశ్లేషిస్తున్నారు. పవన్ ప్రభావం కొంత వరకూ ఉన్నా.. ఏ మేరకు విజయావకాశాలను ప్రభావితం చేయగలుగుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు.
ప్రస్తుతం ఇదే అందరినీ గందరగోళంలో పడేస్తోంది. రాజకీయాలను పవన్ ఇంకా సీరియస్గా తీసుకోలేదేమోననే సందేహాలు అందరిలోనూ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తి అయితే ఇప్పటికే రంగంలోకి దూకి తీవ్రం గా ప్రయత్నిస్తూ ఉండాలని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు తిరిగి సమస్యలు తెలుసుకుం టా నని చెప్పిన పవన్ యాత్ర ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదు. కొత్త రక్తం అంటూ చెబుతున్నా.. పార్టీలో చేరు తున్న వారిని చూస్తే ఇది కొత్త రక్తమేనా అనిపిస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు వేదికగా మారతాడని అంతా భావిం చినా.. ఇప్పుడు మాత్రం ఆ అభిప్రాయాన్ని పోగొట్టేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరిన నేతలు.. ఇప్పుడు కొంత వెనకడుగు వేస్తున్నారు. జత కట్టడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
జనసేన ఆవిర్భవించి ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి. ఇక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇప్పటికిప్పుడు జనసేన బలపడిపోయే అవకాశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఎన్నో కొన్ని సీట్లను తీసుకుని వైసీపీతో పొత్తుతో వెళ్లాలని జనసేన భావిస్తున్నట్టుగా టాక్. అందుకే వైఎస్సార్సీపీతో పొత్తు ప్రయత్నాల్లో ఉందట. కనీసం 30 చోట్ల అంటే పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉన్న గోదావరి, విశాఖ జిల్లాల్లో పోటీ చేసినా 15 సీట్లు అయినా గెలవడం కష్టమే అని చర్చలు జరుగుతున్నాయి. ఎవరితో పొత్తుకు వెళ్లినా వాళ్లు 30 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదట. సగం సీట్లలో అవకాశం ఇచ్చినా జనసేన ఏ మేరకు సత్తా చాటుతుందో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఈ ప్రతిపాదన పట్ల వైసీపీ అంత సానుకూలంగా లేదని సమాచారం. ఇదీ పవన్ పార్టీ పని.. మనోడు పార్టీని డెవలప్ చేయడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.