భారతీయ చలన చిత్ర రంగంలో బహుభాషా నటుడు అయిన ప్రకాశ్ రాజ్ ఈ మద్య రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేసుకొని ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళ రాజకీయాలపై మరోసార ఘాటుగా స్పందించారు ప్రకాశ్ రాజ్. రాజకీయాలు రియలెస్టేట్ వ్యాపారంలా మారాయని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వారంతా రియలెస్టేట్ వ్యాపారుల్లా మారిపోయారని అన్నారు. తాను పార్టీతో పోరాడటం లేదని, ప్రభుత్వంతో పోరాడుతున్నానని చెప్పారు.
రాజకీయ నాయకులు తమిళనాడును అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో నదులు, పొలాలు, అమాయకులైన ప్రజలు ఉన్నారు. రండి బాబూ రండి" అంటూ అయినకాడికి అమ్మేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే కాకుండా... అన్ని పార్టీలదీ ఇదే దారి అంటూ విమర్శించారు.
ప్రస్తుతం రాజకీయలకు వస్తే..ప్రజలకు సేవ చేసేందుకు కాదు..ప్రజలను దోచేందుకే అన్నట్టు ఉంది వారి పనితీరు. ఇక రాష్ట్రంలో అన్నాడీఎంకే కానీ, కేంద్రంలో ప్రధాని మోదీ కానీ ప్రజల తరపున లేరంటూ దుయ్యబట్టారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఏదీ మారిపోదని అన్నారు. సమాజానికి మంచి జరగాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. రానున్న రోజుల్లో అన్నాడీఎంకే కనుమరుగు కానుందని తెలిపారు.