ఏపీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని చెబుతున్నారు సీనియర్ నాయకులు. గత ఎన్నికల సమయంలో పోగొట్టుకున్న తమ పార్టీ పరువును సాధ్యమైనంత త్వరగా వెనక్కి తెచ్చేందుకు పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మారిన వారు తిరిగి చేరే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో పాతకాపులకు పెద్ద పీట వేస్తున్నారు. విషయం అలా ఉంచితే.. ఉమ్మడి ఏపీ ఆఖరు సీఎం, కాంగ్రెస్ వాది..నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. విభజన సమయంలో అత్యంత కీలకంగా మారిపోయారు. విభజనకు వ్యతిరేకంగా ఆయన చక్రం తిప్పారు. కీలక నాయకులను ఒకే గూటికి తెచ్చారు. అయినపప్పటికీ విభజన ఆగలేదు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కిరణ్ రెడ్డి కాంగ్రెస్కు రాం రాం పలికారు. అంతేకాదు, అదేసమయంలో సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో తాను దూరంగా ఉండి కొందరిని బరిలోకి దింపారు. అయితే ఏ ఒక్కరూ కనీసం డిపాజిట్ కూడా తిరిగి దక్కించుకోలేదు. దీంతో అప్పటి నుంచి కిరణ్ తన పనేదో తాను చూసుకుంటూ.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, మరో పదిమాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏపీలో పుంజుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీనియర్ నేతలను మళ్లీ కాంగ్రెస్లోకి చేర్చుకోవాలని నిర్నయించుకుంది. ఈ నేపథ్యంలో కిరణ్ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించింది.
ఈయన కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వేరే వేరే పార్టీల్లోకి వెళ్లకుండా.. కాంగ్రెస్లోనే ఉండడం మంచి దని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన త్వరలోనే తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు రెడీ అవుతున్నారని వార్తలు అందుతున్నాయి. అయితే, కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం .. మాత్రం ఏపీలో అధికార పార్టీని విడిచి పెట్టి.. ప్రతిపక్షంపై దాడి చేయాలని సూచించింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ నేతలు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీపై నిప్పులు చెరిగేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే కిరణ్ కుమార్.,. జగన్పై తీవ్ర విమర్శలు చేస్తాడని విశ్లేషకులు అంటున్నారు. దీనికి వారు గతంలో అసెంబ్లీలో వైసీపీ గురించి కిరణ్ రెడ్డి చేసిన ప్రసంగమే గీటురాయిగా చెబుతన్నారు. వైఎస్ అంటే నిండు అభిమానం ఉన్నప్పటికీ.. జగన్పై మాత్రం కిరణ్ తీవ్ర అసహనంతో ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో జగన్ను ఇరుకున పెట్టేలా పదునైన వ్యాఖ్యలతో కిరణ్ చెలరేగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.