ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్రంలోని బీజేపీకి భయపడ్డారా? వారి కనుసన్నల్లోనే ఏపీలో పాలన సాగించా రా? తన మంత్రి వర్గాన్ని విస్తరించారా? అంటే.. ఔననే అంటున్నారు విశ్లేషకులు. 2014లో ఏపీలో ఏర్పడిన ప్రభుత్వం ఒక్క బాబుదే కాదు.. అప్పటి ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ సంయుక్తంగా ఎన్నికల్లోకి వెళ్లి పోటీ చేసి గెలుపొందాయి. దీంతో ఇక్కడ కూడా ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పాటైందని పలుమార్లు చంద్రబాబు సైతం ఢిల్లీలో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఆయన ప్రభుత్వంలో పావులు కదిపారని, బీజేపీకి అనుకూలంగానే ఆయన తన కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారని తాజాగా ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రసారం చేసింది.
అంతేకాదు, బీజేపీ నుంచిటీడీపీ విడిపోయిన తర్వాత కూడా.. చంద్రబాబు ఇప్పటికీ బీజేపీ అంటే భయపడుతున్నారని తెలిపింది. వాస్తవానికి చంద్రబాబు గత రెండు కేబినెట్లను పరిశీలిస్తే.. ఎక్కడా మైనార్టీ శాఖకు మంత్రి లేకుండా ఉండడం, అసలు శాఖే లేకుండా పాలన చేయడం అనేది లేదు. మైనార్టీ వర్గాన్ని అంతో ఇంతో ఆకట్టుకునేందుకు చంద్రబాబు అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన పంథా ఏమిటో అర్ధం కాకుండా వ్యవహరిస్తున్నారు. నిజానికి మైనార్టీ శాఖను ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు ఆశాఖను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు.
దీనికి ప్రధాన కారణం.. ఆయన బీజేపీకి భయపడుతున్నారని ఆంగ్ల మీడియా పేర్కొంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కూడా మైనార్టీలకు ప్రత్యకంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన మైనార్టీ వర్గాన్ని ఎన్నడూ పట్టించుకోలేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఆయన మైనార్టీలకు టికెట్లు కూడా కేటాయించలేదు. దాదాపు అందరినీ పక్కన పెడుతూనే ఉన్నారు. ఇదే తరహాలో ఎన్డీయేతో చెలిమి చేసినన్నాళ్లు బాబు.. ఏపీలో మైనార్టీలను పట్టించుకోలేదనే వ్యాఖ్యలు ఆంగ్ల మీడియాలో కనిపించాయి. వక్ఫ్ బోర్డు ను కూడా ఖాళీగానే ఉంచారని మీడియా తెలిపింది.ఇక, ఇప్పుడు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది.
అయినా కూడా రాష్ట్రంలో మైనార్టీ శాఖ ఏర్పాటు కాలేదు. దీనికి కూడా మోడీనే కారణమనేది మీడియా మాట. ఇప్పటికిప్పుడు మైనార్టీ శాఖను ఏర్పాటు చేస్తే.. గతంలో బీజేపీకి భయపడే మైనార్టీ శాఖను ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు ఏర్పాటు చేశారని, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొనాల్సి ఉంటుందని భావించిన చంద్రబాబు.. దీనిపై ఇప్పటికీ మౌనంగా ఉన్నాడని అంటున్నారు. రాబోయే రోజుల్లోనూ ఏపీలో పరిస్థితి ఇంతేనని చెబుతున్నారు. సో.. మైనార్టీ శాఖ లేకపోవడం వెనుక స్టోరీ ఇదేనని ఆంగ్ల మీడియా కథనం పేర్కొనడం గమనార్హం.