2014 ఎన్నికల సమయం.. ఆ ప్రభుత్వ ఉన్నతోద్యోగిని రాజకీయ నేతను చేసింది. 2014 ఎన్నికల ఫలితం.. ఆ రాజకీయ నేతను ప్రజాప్రతినిధిని చేసింది. 2014 చంద్రబాబు కేబినెట్.. ఆ ప్రజా ప్రతినిధిని.. మంత్రిని చేసింది. కట్ చేస్తే.. ఆయనే ఎస్సీ వర్గానికి చెందిన గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్బాబు. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన రావెల.. అంతే అనూహ్యంగా మంత్రి అయ్యారు. నిజానికి ఇదే గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర వంటి కీలక సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నప్పటికీ.. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో చంద్రబాబు రావెలకు పెద్ద పీట వేశారు.
అయితే, ఆయన మంత్రిగా తీవ్రంగా ఫెయిలయ్యాడు. పార్టీలోని నేతలను కలుపుకొని పోవడంలోను, మంత్రిగా ప్రజా సమస్యలు తీర్చడంలోనూ కూడా ఆయన విఫలమయ్యారు., అంతేకాకుండా.. ఆయన ఇద్దరు కుమారులను ఆయన ఓ తండ్రిగా అదుపులో పెట్టుకోవడంలోనూ తీవ్రంగా విఫలమ య్యారు. ఇద్దరు కుమారులు మహిళల వెంట పడగా...పెద్ద ఎత్తున ఆ సంఘటనలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని ఖండించాల్సిన మంత్రి రావెల.. వైసీపీ అధినేత జగన్పై ఎద్ద ఎత్తున విమర్శల దాడి పెంచారు. జగన్ మీడియా తనపై దెబ్బేయాలని చూస్తోందన్నారు. ఆ తర్వాత ఆయనకు టీడీపీ స్థానిక నేతల నుంచి తీవ్ర ఎదురు దాడి ఎదురైంది. తమ కులం వాడని, తమ వాడని భావించి 2014 ఎన్నికల్లో గెలిపిస్తే.. తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు రావెలపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు చేశారు. ఇదిలావుంటే, చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఆర్పీఎస్ నేత మంద క్రిష్ణను రావెల సొంత కులమనే వ్యామోహంతోనే మరేమో.. నెత్తిన పెట్టుకున్నారు.
ఆయనకు తన ఇంట్లోనే విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు నచ్చని పని చేస్తూ వచ్చారు. దీంతో ఆయనను చంద్రబాబు ఒక్కసారిగా కింద పడేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పటికి నాలుగు సార్లు అప్పాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదు. దీంతో రావెల చంద్రబాబుకే చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తన బలం ఏమిటో చంద్రబాబు కు చూపించాలని భావించి.. సొంతంగా ఎస్సీ వర్గీకరణకు సంబందించి గుంటూరులో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల13న(నేడు శుక్రవారం) జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సీ చట్టసవరణపై సుప్రీం కోర్టు చేసిన సిఫార్సులను ఉపసంహరించుకోవాలని ఆయన దీక్ష చేయబోతున్నారు.
పట్టణంలో ఈ మేరకు...దాని గురించి పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో..కేవలం రావెలస కిశోర్ బాబు ఫోటో మాత్రమే ముద్రించుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇక, ఇప్పుడు ఆయనకు ఎంత మంది అండగా నిలుస్తారో చూడాలనిఅంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు అంతటి వాడు పిలిచి టికెట్ ఇచ్చి, కోరి పదవి ఇచ్చి గౌరవిస్తే.. రావెల తన బుద్ధి పోనిచ్చుకోలేదని కొందరు టీడీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక, ఇప్పుడు ఆయన బలం.. బలగం ఏంటో తేలిపోతుందని, ఆయన వల్ల పార్టీకి ప్రభుత్వానికి జరిగిన మేలు ఏమీ లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.