`ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలకు మరింత చేరవకండి. వారి సమస్యలు తెలుసుకోండి` అంటూ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఎంతలా హితబోధ చేసినా కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్య ధోరణి మాత్రం వీడటం లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల గురించి ఆరాతీసిన చంద్రబాబుకు.. ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయినా.. ఇంకా కొన్ని నియోజకవర్గ ప్రజలకు తమ ఎమ్మెల్యే ఎవరో తెలియడం లేదనే ఆశ్చర్యకరమైన అంశం బయటికి వచ్చిందట. ఇది తెలిసిన బాబుకు.. కోపం నషాళానికి ఎక్కిందట. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. కొందరు ఎమ్మెల్యేలు ఇల్లు దాటి బయటికి వెళ్లడం లేదని గమనించి ఆయన.. వెంటనే వాళ్లందరినీ పిలిపించుకుని పూర్తిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలకు, ప్రజలకు మధ్య దూరాన్ని తెలిపేందుకు ఇదొక్క ఉదాహరణ చాలు అంటున్నారు విశ్లేషకులు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక కొందరు తమ చుట్టూ గిరి గీసుకుని అందులోనే ఉంటున్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యే ఎవరో మారుమూల గ్రామాల్లోని ప్రజలకు తెలియదంటే ఆశ్చర్యం అనిపించకమానదు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో ఇలానే జరుగుతోంది. ప్రజలకు, అధికారపక్ష ఎమ్మెల్యేలకు మధ్యనున్న దూరం ఎంతన్న విషయాన్ని స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పిన ఉదంతమిది. హుటాహుటిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను ఆయన పిలిపించారు.
ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటులో అనుసరించిన విధానాన్ని ఎంపీలకు వివరించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. గతం కంటే ఉత్సాహంగా టీడీపీ ఎంపీలు వ్యవహరించాలని.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో విఫలం చెందుతున్నట్లుగా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో ఈసారి మరింత ఉత్సాహంగా వ్యవహరించాలని కేంద్రం చేసిన తప్పుల్ని అందరికీ అర్థమయ్యేలా చేయాలని చెప్పారట. ప్రత్యేక హోదా సాధన విషయంలో వివిధ పార్టీలకు ఏపీకి జరిగిన అన్యాయం గురించి వివరించాలని మద్దతు తీసుకురావాలన్నారు. వివిధ పార్టీల మద్దతును కోరే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును మాత్రం అస్సలు కోరకూడదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పటం విశేషం.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కొందరు అధికారపక్ష ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆయా నియోజకవర్గాల ప్రజలు చెప్పలేకపోతున్నా రంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఉన్నారని.. కానీ.. దాన్ని రాజకీయంగా మలుచుకునే విషయంలో లోటుపాట్లు ఉన్నట్లుగా తెలుస్తోందని వివరించారట. గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలకు దగ్గరవ్వాలని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారట. నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న వారి పేర్లు కూడా ఓట్లేసిన ప్రజలకు తెలీకపోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.