చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అమర్నాథ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వైసీపీ పక్కా ప్లాన్ వేస్తోంది.. ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేసేందుకు సన్నద్ధమవుతోంది.. అమర్ను వైసీపీ ఎందుకిలా టార్గెట్ చేసిందనే డౌట్ వస్తోంది కదా.. అయితే అమర్ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి విషయం అర్థమవుతుంది. 2014 ఎన్నికలకు ముందు అమర్ తన అనుచరగణంతో వైసీపీలోకి జంప్ అయ్యారు. అక్కడ వైసీపీ నుంచి గెలిచిన తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ ఆయనను ఓడించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో అధికార టీడీపీలోనూ మంత్రికి యాంటీ వర్గం తయారైంది.
అయితే, మంత్రి అమర్నాథ్రెడ్డి మాత్రం అభివృద్ధినే ఎజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. మళ్లీ తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఏర్పడిన తర్వాత 1983, 1985, 1989, 1994, 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి తిప్పేస్వామి, 2014లో వైసీపీ అభ్యర్థి అమరనాథ్రెడ్డి గెలుపొందారు. అయితే, వైసీపీ గెలిచి టీడీపీలో చేరి ఆయన మంత్రి అయిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం గత ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
సొంతపార్టీలోనే ఆయనకు వ్యతిరేకవర్గం తయారైంది. ఇక వైసీపీ కూడా ధీటుగానే ఉంది. అయితే, అమర్నాథ్రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత సుభాష్ చంద్రబోస్ టీడీపీ నుంచి బరిలోకి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే పార్టీని వదిలివెళ్లి మళ్లీ వచ్చిన అమర్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని సుభాష్ వర్గం జీర్ణించుకోలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో సుభా్షకు అంతగా ప్రాధాన్యత లేని నామినేటెడ్ పదవి కట్టబెట్టడంపై కూడా ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అయితే. అమర్నాథ్రెడ్డి మళ్లీ టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీలో నాయకత్వ సమస్య ఏర్పడింది. ఇప్పుడు దాని నుంచి బయటపడినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో జడ్పీ మాజీ ఛైర్పర్సన్ మొగసాల రెడ్డెమ్మ, గంగవరం మాజీ ఎంపీపీ సీవీ కుమార్, పెనుమూరుకు చెందిన రాకే్షరెడ్డిలను వైసీపీ అధిష్ఠానం సమన్వయకర్తలుగా నియమించింది. వీరందరూ కలిసి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల వి.కోట మండలం తోటకనుమకు చెందిన వెంకటేగౌడను నియోజకవర్గ కో-ఆర్డినేటర్గా నియమించింది. గత ఎన్నికల నుంచి నియోజకవర్గంలో ఆయన చురుగ్గా పర్యటిస్తున్నారు. ఈసారి ఆయన టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కిరణ్ రాకతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమేరకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా మంత్రి అమర్నాథ్రెడ్డికి ప్రతికూలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.