కింద పడ్డా పైచేయి తనదేననే టైపులో చంద్రబాబు మించిపోయారు. కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మోడీ.. ఏకంగా పార్లమెంటు వేదికగానే చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేశారు. మరి ఈస మయంలో చంద్రబాబు ఏం చేయాలి? తాను చేసింది తప్పని ఒప్పుకుంటే ఇప్పటికైనా ప్రజలు క్షమిస్తారనే విషయాన్ని గ్రహించాలి. కానీ, ఆయన జగన్, పవన్లపై ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. `వారిప్పుడు ఎక్కడ?` అంటూ.. అర్ధరాత్రి నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రశ్నించారు. అదేసమయంలో పవన్పై వ్యాఖ్యలు సంధించారు. పార్లమెంట్లో హోదా కోసం టీడీపీ పోరాడుతుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారు. బీజేపీ, ఎన్డీఏకు కొంచెం కూడా నష్టం జరగకుండా వారిని కాపాడుతూ.. టీడీపీ ఎంపీలపై అటాక్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం ఇలాగేనా? ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే.. దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. అంటూ లేని హంగామాను నెత్తిన మోపుకున్నారు. ఈ రోజు వైసీపీ ఎక్కడుంది? జగన్ కోర్టుకు పోయి ఇక్కడికొచ్చి పడుకొనే పరిస్థితి. దేశమంతా కలిపేస్తామన్న వారు ఎక్కడున్నారు? ప్రధాని వీరిని మనపైకి ఎగదోసి.. అన్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తారని ఆశించాం. 125 కోట్ల మంది మిమ్మల్ని గెలిపించారని అంటున్నారు. అందులో మేం లేమా? మాకన్యాయం జరగలేదా? న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మోడీ సమాధానానికి స్పందించే హక్కు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ కేశినేని నానికి ఉంది. అన్నారు. వాస్తవానికి చంద్రబాబుకు మోడీ సరిగానే సమాధానం చెప్పారు. ఆయన కోరిక మీదనే ప్యాకేజీ ఫలాన్ని ఇచ్చామన్నారు. అయినా చంద్రబాబు ఇంకా.. పవన్పైనా, జగన్పైనా ఏడుస్తున్నారు.
ఆనాడు.. ప్రత్యేక హోదా వద్దని వీరిద్దరూ ఎక్కడైనా .. ఎప్పుడైనా చెప్పారా? అదే నిజమైతే.. యువభేరి సభలను జగన్ ఎందుకు నిర్వహించినట్టు.. పవన్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో ఎందుకు పోల్చినట్టు.. వీటికి సమాధానం చెప్పాక కానీ, చంద్రబాబుకు వారిని విమర్శించే అర్హత లేదనేని విశ్లేషకుల అభిప్రాయం. సెంటిమెంట్తో ఆడుకుంటారా? ఎదురుదాడి మంచిది కాదు. నేను మీ మాట వినలేదని నాపై మీకు కోపం ఉందేమో! మీ మాట వినకపోవడానికి కారణం.. మీరు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పోతున్నారని.. అన్యాయం చేస్తున్నారని..! అనడం ద్వారా తిరిగి చంద్రబాబు నెపాన్ని ఢిల్లీపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ రోడ్డెక్కితే.. ఆనాడు కఠిన ఆంక్షలు విధించి డీజీపీ(నాటి) సాంబశివరావుతో తీవ్రమైన వ్యాఖ్యలు/ హెచ్చరికలు చేయించలేదా? ఆ నాడు ఏం జరిగిందో చంద్రబాబు కావాలనే మరిచిపోయి ఉండొచ్చు. కానీ, చరిత్ర ఎప్పుడూ నికరంగా నిజమే చెబుతుంది. నేడు జగన్, పవన్లను అని మరింత బద్నాం కావడం తప్ప చంద్రబాబు సాధించేది ఏమీ లేదు. ఇప్పటికైనా వారిద్దరినీ కలుపుకొని పోయి.. కేంద్రంపై పోరాడితేనే ఫలితం దక్కి.. చంద్రబాబు హీరోయిజం నిలబడేది.. మరి ఆదిశగా ఆలోచిస్తారా? చూడాలి.