ఏపీ సీఎం చంద్రబాబు త్రిచక్ర బంధంలో చిక్కుకున్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంపై పోరు చేయడం ద్వారా జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగుతుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిని నిర్ణయించేది తానేనని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన భావించారు. ఇక, ఇదే సమయంలో ఏపీలో రెండు ప్రధాన ప్రతిపక్షాలు వైసీపీ, జనసేనలను ఢీకొట్టేస్తానని, వారికి అడ్రస్ గల్లంతు చేస్తానని ఆయన అనుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తాను తప్ప.. మోడీపై కాలరెగరేసే దమ్ము ఎవరికీ లేదని నిరూపించేందుకు తహతహలాడారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు వ్యూహాలు పక్కాగా బొక్కబోర్లా పడ్డాయి. తాను అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి. కేంద్రం గతంలో ఏం చెప్పిందో.. ఇప్పుడూ మరోసారి అదే చెప్పింది. అయితే, గతాన్ని మించిన విధంగా చంద్రబాబును పార్లమెంటు వేదికగా బద్నాం చేసింది.
యూటర్న్ అంకుల్! అంటూ ప్రధాని మోడీనే చంద్రబాబును దుయ్యబట్టారు. ఈ పరిణామాలు ఊహించని చంద్రబాబు.. కేంద్రంపై ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరో పదిమాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ఎలా దాటాలి?! జగన్, పవన్లను ఎలా కట్టడి చేయాలి?! అనే విషయాలు చంద్రబాబు సీనియార్టీకి పరీక్ష పెడుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. పార్లమెంటు పరిణామాలు చంద్రబాబుపై తీవ్ర దెబ్బవేస్తే.. ఈ పరిణామాలను జగన్ అందిపుచ్చుకున్నారు. చంద్రబాబు చేసిన తప్పులపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సీనియార్టీ ఏపాటిదో ఇప్పుడు అర్ధమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, పవన్ సైతం తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. టీడీపీకి మతిమరుపు జబ్బు పట్టుకుందని ఎద్దేవా చేయడం ద్వారా చంద్రబాబును ఆయన టార్గెట్ చేసిన విధానం అదిరిపోయింది.
దీంతో వచ్చే రోజుల్లో తన ప్రాభవాన్ని తిరిగి ఎలా సంపాయించుకోవాలా? అనే దానిపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లి మరీ ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కూడా ఆశించిన మైలేజీ కనిపించలేదు. గతంలో తాను చేసిన ప్రకటనలు, అసెంబ్లీలో ఏపీకి ప్యాకేజీ అద్భుత మని చేసిన తీర్మానం వంటివి ఆయనను తీవ్రమైన ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఎలా ప్రజల్లోకి వెళ్లాలి? అనే కీలక అంశాలు చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో జగన్ను కానీ, పవన్ను కానీ ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడిపోయింది. పార్లమెంటులో మేం నిలదీసి సాధించాం అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, పార్లమెంటు పరిణామాలపై జగన్, పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. తాజా అంచనాల ప్రకారం .. చంద్రబాబు మరోసారి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. తాను కడిగిన ముత్యాన్నని.. తనకే పాపం తెలియదని నమ్మించే ప్రయత్నం చేయనున్నారు. ఈ విషయంలో చంద్రబాబుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు విపక్షాలపై ఎదురు దాడే ఆప్షన్గా ఉంది. అదేసమయంలో జగన్, పవన్లు కూడా తనతో కలిసి వచ్చి ఉంటే.. ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదని, జగన్ రాజీనామాలు చేయించి ఆయన ఎంపీలను ఇంట్లో పడుకోబెట్టాడని, పవన్ బీజేపీతో చేతులు కలిపి ద్రోహం చేశారని చెప్పడాన్ని మరింత విస్తృతం చేయనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా.. బాబు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి రావడం నిజంగా ఆయనకు మైనస్సే అంటున్నారు పరిశీలకులు.