ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన ప్రత్యేక హోదా అంశంపై ఏ పార్టీకి ఆ పార్టీ.. ఏ నాయకుడికి ఆ నాయకుడు.. దోబూ చులాడుతున్నారు. అందరి గళమూ ఒక్కటే.. కానీ, అందరి దారులు మాత్రం వేరు వేరు. ఒకరు చేసే దీక్షలను మరొకరు తప్పు పడతారు. ఒకరు చేసే ఆందోళనను మరొకరు అడ్డుకుంటారు.. ఉక్కు పాదంతో అణిచి వేస్తారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న `ప్రత్యేక` రాజకీయాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆది నుంచి నిఖార్సుగా పోరాటం చేస్తోంది ఒక్క వైసీపీనే. అటు కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ కానీ, వామపక్షాలు కానీ, జనసేన కానీ.. ఎక్కడా నిఖార్సుగా పోరాటం చేసింది లేదు. ప్రజల్లోకి వెళ్లింది కూడా లేదు. అంతేకాదు, టీడీపీ అయితే, ప్రత్యేక హోదా అన్నవాడు పాకిస్తాన్ పౌరుడితో సమానమన్నట్టుగా వ్యవహరించింది. కేసులు పెట్టింది.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజనతోనే ప్రజల్లో పరపతి, పరువును కూడా పోగొట్టుకున్న ఈ పార్టీకి ఇన్నాళ్లు గా మరిచిపోయిన ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేతలు ఎందుకు తెలు గు వారిని, ప్రత్యేక హోదా ఉద్యమాలను మరిచిపోయారో చెప్పాలి? హోదా విషయాన్ని కాలరాచి.. కనీసం.. విభజన చట్టంలో కూడా చేర్చకుండా దోబూచులాడుకుంది కాంగ్రెస్ కాదా? నేడు మళ్లీ మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజల్లోకి వస్తే.. ప్రజలు నమ్ముతారా? ఇక, వామపక్షాలు.. ఏ ఎండకు ఆగొడుగు పడుతూ.. చారిత్రక తప్పిదాలకు నెలవుగా మారాయి. ప్రత్యేక హోదా విషయాన్ని.. భుజాలపైకి వేసుకునేందుకు ఏళ్ల సమయం పట్టింది. ప్రత్యేక హోదా విషయంలోనూ ఏపార్టీకి మద్దతివ్వాలి. ఏ పార్టీ తోకపుచ్చుకుని నడవాలి.. అనే విషయాల్లో కామ్రేడ్లకు నేటికీ స్పష్టత కరువవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను భుజాలపై వేసుకుని జగన్ ముందుకు సాగుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంపై అవిశ్వాసం ఆలోచన ఎవరిది? ఎంపీలతో రాజీనామాలు చేయించడాన్ని చంద్రబాబు ఎన్నికల కోణంలోనూ, తనకు లబ్ధి కోణంలోనూ చూసుకుంటే.. జగన్ విపక్షంలో ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేశాడు. ఎంపీలతో వెనుకా ముందు కూడా ఆలోచించకుండా రాజీనామాలు చేయించి.. ఏపీకి నిజమైన రాజకీయ నేతగా ఆయన వ్యవహరించారు.
ఇక, అవిశ్వాసం పెట్టి.. మోడీని హడల కొడతామని చెప్పిన చంద్రబాబు .. అదే మోడీ చేతిలో చావు దెబ్బతిని.. కిక్కురుమనలేని పరిస్థితిని కల్పించుకున్నాడు. యూటర్న్ అంకుల్గా దేశం మొత్తం పేరు తెచ్చుకున్నాడు. తాజాగా వైసీపీ చేస్తున్న రాష్ట్ర బంద్ను కూడా ఆయన ప్రత్యేక రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. దీని తాలూకు క్రెడిట్ వైసీపీకి ఎక్కడ వెళ్తుందోనని ఆయన ఉక్కుపాదం మోపుతున్నాడు. అయినప్పటికీ.. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారు చేయాల్సింది వారు చేస్తారు.