పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. నేటి సన్నిహితులే ఎన్నికల సమయానికి ప్రత్యర్థులుగా మారిపోతా రు. ఇది రాజకీయాల్లో ఓ సాధారణ అంశంగానే ఉంటోంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే టీడీపీ సీనియర్ నేత, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎదురైంది. ఆయనను ఓడించి తీరుతానంటూ.. ఓ ఎన్నారై మహిళ శపథం చేసినట్టుగా గుంటూరు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో మంత్రి పుల్లారావుకు మైండ్ బ్లాక్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీకి విదేశాల్లోనూ అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న టీడీపీ అభిమానుల్లో గుంటూరుకు చెందిన విడదల రజనీ కుమారి ఒకరు. ఈమెకు టీడీపీ అంటే మక్కువ ఎక్కువ.
ఈ క్రమంలో గత ఏడాది విశాఖలో నిర్వహించిన పార్టీ పండుగ మహానాడులో కూడా పాల్గొంది. అయితే, చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు మాత్రంగుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాయం తీసుకుంది. ఆయన కూడా రజనీని పరిచయం చేసేందుకు ఉవ్విళ్లూరారు. వెంటనే చంద్రాబు వద్దకు తీసుకు వెళ్లి.. ఆమెను పరిచయం చేశారు. దీంతో ఆమె పార్టీకి కొంత మేరకు ఫండ్ కూడా ఇచ్చి.. పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేందుకు ముందుకు వచ్చింది. మహానాడుకు విరాళాలు కూడా సమర్పించింది. ఇక, అందరితోనూ కలుపుగోలుగా కూడా వ్యవహరించింది. ఇలా రజనీ కుమారి తన హవాను పెంచుకునేలా వ్యవహరించింది. అయితే, ఈ పరిణామం.. ఏకంగా ఎమ్మెల్యే సీటుపై పడుతుందని ఎవరూ ఊహించలేదు.
అది కూడా తనను పార్టీకి పరిచయం చేసి ఏదో కొంత మేరకు సాయం చేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సీటుకే రజనీ ఎసరు పెట్టే ప్రయత్నం చేసింది. వచ్చే ఎన్నికల్లో తనకు చిలకలూరి పేట టికెట్ కావాలని ఆమె పట్టుబడుతోంది. అయితే, ఈ టికెట్లో ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని, ఆయనను తప్పించే ప్రసక్తి లేదని అధిష్టానం కుండ బద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే ఆమె తనకు పార్టీలోనూ, ఇతరత్రా ఉన్న అభిమానులు, పరిచయాలతో ఢిల్లీ స్థాయివరకు ఎగబాకింది. ఈ విషయం సీరియస్గా తీసుకున్న పుల్లారావు తనకు తెలియకుండానే పార్టీ పెద్దలతో పరిచయాలు ఏంటని ఆమెపై సీరియస్ అయినట్టు టాక్. ఇంతలోనే చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్గా ఉన్న రజనీకుమారి మామ తన పదవి నుంచి తప్పుకున్నారు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు.
ఈ పరిణామాలతో రజనీ ఇగో హర్ట్ అయ్యింది. రాజకీయంగా తనను అణగదొక్కే ప్రయత్నం చేయడంతో పాటు తమ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన పుల్లారావునే ఓడించి తీరాలని ఆమె శపథం చేసింది. అంతేకాదు, ఇప్పటి వరకు టీడీపీలో సభ్యత్వం ఉన్న రజనీ కుమారి ఫ్యామిలీ మొత్తం.. ఒక్కసారిగా రాజీనామాలు చేసేసింది. దీంతో రజనీ చూపు ఇప్పుడు వైసీపీ వైపు పడింది. తనను వైసీపీలోకి చేర్చుకోవాలని, వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఇవ్వాలని, ఇక్కడ టీడీపీ సీనియర్ పుల్లారావును ఓడించి తీరుతానని, పార్టీకి బెనిఫిట్ అవుతుందని ఆమె జగన్కు రాయబారం పంపింది. అయితే, జగన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో పార్టీ ఫండ్తో పాటు ఎన్నికల ఖర్చు భరిస్తానని కూడా రజనీ కుమారి జగన్కు వర్తమానం పంపింది.
అయితే, వైసీపీకి చిలకలూరి పేటలో మర్రి రాజశేఖర్ ఉండడంతో జగన్ ఆమెకు ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు. అయితే ఎలాగైనా పుల్లారావును ఓడించాలని రజనీ పట్టుదలతో ఉంది. ఆమె పుల్లారావును ఓడిస్తానని చేసిన ఓపెన్ సవాల్తో పుల్లారావు అండ్ వర్గం కాస్త టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తోంది. బలమైన వాయిస్ ఉండడంతో పాటు ఆమె ఫ్యామిలీలో ఉన్న సామాజిక సమీకరణలు, ఆర్థిక నేపథ్యం ఆమెకు ప్లస్గా ఉన్నాయి. మరి ఈ ఎన్నారై మహిళ శపథం ఏ మేరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. ఏదేమైనా .. వచ్చే ఎన్నికల్లో పుల్లారావు జాతకం తిరగబడుతుందేమో చూడాలి.