రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా అలాంటి వాతవారణమే ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తాజాగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వయోభారం, అనారోగ్య సమస్యలతోనే ఆయన తన రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక, తాజాగా ఆయన పత్తికొండలోని ఓ గ్రామంలో నిర్వహించిన గ్రామ దర్శిని కార్యక్రమంలో తన రాజకీయ వారసుడిని అధికారికంగా ప్రకటించారు.
దీంతో కేఈ రిటైర్మెంట్ విషయంలో స్పష్టత వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో గ్రామదర్శిని కార్యక్రమానికి కేఈ హాజరయ్యారు. గ్రామంలో బీటీ, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామం లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రూ.16 వేల కోట్ల లోటు అప్పుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, విభజన హామీలను అమలు చేస్తాడని ప్రధాని మోడీని నమ్మి కేంద్రంతో కలిసి అడుగులు వేశామని అయితే ఆయన మోడీ ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో ఒప్పుకున్నామని తెలిపారు.
ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో చేస్తున్న పోరాటం గురించి ప్రజలకు తెలుసునని, అయితే వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లేందుకు వైసీపీ, జనసేనలు హోదా, ఉద్యమాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికలో పత్తికొండ నియోజకవర్గంలో తన వారసుడిగా తన తనయుడు కేఈ శ్యాంబాబు బరిలో నిలుస్తాడని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తన గురించి ఆయన ఎలాంటి ప్రకటనా చేయక పోవడం గమనార్హం. ఇక, దీనికి రెండు రోజుల ముందుగానే పార్టీ అధినేత చంద్రబాబు వద్ద మీటింగ్ పెట్టిన కేఈ.,. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొంటానని, తన వారసుడిగా శ్యాంబాబుకు అవకాశం ఇవ్వాలని కోరారట. దీనికి చంద్రబాబుఓకే అన్నాకనే అధికారికంగా నియోజకవర్గంలో శ్యాంబాబును కేఈ ప్రకటించారని అంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లో ఓ శకం.. రిటైర్ కాబోతోందన్న వార్త సంచలనంగా మారింది.