ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. వచ్చే ఎన్నికల్లోనూ అవే ఫలితాలు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తుగానే అభ్యర్థులను ఖారారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారికి సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరాంద్రలో గత ఎన్నికలకు ముందున్న పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ ఎక్కువగా ఉత్తరాంధ్రపైనే దృష్టి సారిస్తున్నారు. తన సొంత సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో సత్తాచాటాలని చూస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి, వారిని ప్రజల్లోకి బలంగా పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఉత్తరాంధ్రలో కీలక స్థానమైన విశాఖ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నవిషయంలో పూర్తి క్లారిటీ లేదు. విశాఖ జిల్లాలో కాపుల ప్రభావం ఎక్కువ. 2009లో ఇక్కడ నుంచి చిరు ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో ఉన్నప్పుడు టీడీపీ చావుదెబ్బ తింది. చాలా స్థానాల్లో టీడీపీ మూడో ప్లేస్కు పడిపోయింది. ఇక్కడ నుంచే ప్రజారాజ్యం తరపున నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. విశాఖ ఎంపీ సీటును కూడా ప్రజారాజ్యం స్వల్ప తేడాతో కోల్పోయింది. ఇక కీలకమైన విశాఖ ఎంపీ సీటును 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతుండడంతో టికెట్ కోసం పోటీ బాగానే ఉంది. ఇందులో ప్రముఖంగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి లేదా, ఆయన మనవడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇక అనకాపల్లి ఎంపీ సీటు విషయానికి వస్తే సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఒకవేళ టీడీపీలో చేరితే టికెట్ ఆయనకే వస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరికి ప్రస్తుతం వీరు ప్రాథినిత్యం వహిస్తోన్న అరకు, పాడేరు సీట్లే ఇవ్వనున్నారు. ఇక అనకాపల్లి నుంచి మళ్లీ సిట్టింగు ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ కే అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భీమిలి లేదా విశాఖ ఉత్తరం లేదా చోడవరం లేదా ఎక్కడ నుంచి అయినా అసెంబ్లీకే పోటీ చేస్తానని పంతంతో ఉన్నారు.
అదేవిధంగా, రాజమహేంద్రవరంలో సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ స్థానాన్ని ఆయన కోడలు రూపతో భర్తీ చేస్తారని సమాచారం. మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో రూపను బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట బాబు మళ్లీ పోటీకి సిద్దమవుతున్నారు. ఇక నరసాపురం ఎంపీ సీటు విషయానికి వస్తే గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తతో నర్సాపురంలో బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుండడంతో ఎలాగైనా.. నర్సాపురం సీటును దక్కించుకునేందుకు టీడీపీ తరపున కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణం రాజును పోటీకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి మళ్లీ అశోక్ గజపతిరాజుకే టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. ఒకవేళ ఆయన పోటీనుంచి తప్పుకుంటే ఆయన కూతురు అదితికి టీడీపీ టికెట్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయనగరం ఎంపీ టికెట్ను బొబ్బిలి రాజవంశీయుడు బేబి నాయిన కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కాకినాడ స్థానం కూడా మళ్లీ తోట నరసింహంకే దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది.