ఇద్దరు చంద్రులు అప్పులతో కొప్పులు చుడుతున్నారా..? తెలుగు రాష్ట్రాలను అప్పుల కుప్పలుగా మారుస్తున్నారా..? భావితరాలపై మోయలేనంత ఆర్థిక భారాన్ని మోపుతున్నారా..? అప్పులకు తగ్గట్టు అభివ`ద్ధి కనిపించడం లేదా..? అంటే విపక్షాలతో పాటు పలువురు ఆర్థిక విశ్లేషకులు, మేధావులు ఔననే అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతలా అప్పులు లేవనీ, ఇంత భారీ మొత్తంలో వడ్డీలు కట్టలేదని పలువురు అంటున్నారు. విభజన తర్వాత అటు ఏపీలో, ఇటు తెలంగాణలో అప్పులు అమాంతంగా పెరిగిపోయాయి. అయితే, ఇక్కడ ఏపీలో కన్నా కాస్త తెలంగాణలో మెరుగైన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో అప్పులకు తగినట్టు కొంతమేరకు అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తుండగా.. ఏపీలో మాత్రం అప్పులకు... పనులకు పొంతనలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం సుమారు 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే ఉంది. అయితే, హైదరాబాద్ లాంటి విశ్వనగర్ నుంచే రాష్ట్రం మొత్తానికి కావాల్సిన ఆదాయం వస్తుంది. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే పెరిగిన అప్పులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. రెండున్నరేళ్లలోనే 44వేల కోట్లకుపైగా ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకున్నట్లు సమాచార హక్కుచట్టం ద్వారా తెలిసింది. ఈ నాలుగేళ్లో అప్పులు మరింతగా పెరిగాయన్నదనడంలో ఎలాంటి అనుమానం లేదు. అంతేగాకుండా ఈ అప్పులకు ఐదు నుంచి 12 శాతం వడ్డీలు కడుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కేంద్రం, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే స్థాయిలో విపక్షాలకు సమాధానం ఇస్తున్నారు. అవరార్థమే అప్పులు తెస్తున్నామనీ, వాటికి తగ్గట్టుగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామనీ, అంతేగాకుండా... తెలంగాణలో రాబడి కూడా అదే స్థాయిలో ఉందని చెబుతున్నారు. ఇక ఏపీలో మాత్రం ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ లోటుబడ్జెట్ రాష్ట్రంగానే ఉంది. అయితే నూతన రాజధాని నిర్మాణం.. తదితర అభివ`ద్ధి పనులకు అటు కేంద్రం ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక సహకారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వచ్చిపడుతున్నాయి.
ఇక ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెస్తూ ఏపీకి అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. 2017 నాటికి రెవెన్యూ లోటు 24వేల కోట్లకు చేరింది. ఇదే సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్షా34వేల కోట్లుకాగా అంతకుమించి 23కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. ఖర్చు బడ్జెట్ను మించిపోవడం గమనార్హం. గత ఏడాది నాటికే ఏపీ అప్పులు లక్షా 80వే లకోట్లకు చేరినట్లు స్వయంగా ఆర్బీఐనే ప్రకటించింది. ఈ లెక్కలను చూస్తేనే అర్థమవుతుంది.. చంద్రబాబు ప్రజాధనాన్ని ఎలా దుబారా చేస్తున్నారో. నిజానికి.. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులను రాబట్టడం కోసం ఎన్నిసార్లు విదేశీపర్యటనలకు వెళ్లారో. తెస్తున్న లక్షలకోట్ల రూపాయల అప్పులను సక్రమంగా వినియోగించడం లేదనీ, ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని పలువురు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ తరాలకు కష్టాలు తప్పవని అంటున్నారు.