కాంగ్రెస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లైంగిక వివాదంలో చిక్కుకున్నారు. తనను శారీరకంగా వాడుకుని ఆపై వదిలేశారంటూ మదర్ ఫౌండేషన్ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మి ఆరోపించారు. ఈ మేరకు హన్మకొండ, వడ్డేపల్లిలోని జీఎంఆర్ అపార్ట్మెంట్ వద్ద ధర్నా నిర్వహించారు. గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సంస్థలో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో తనకు గండ్రతో పరిచయం అయిందని ఆమె తెలిపారు. ఆ పరిచయం మా మద్య ఇష్టంగా మారడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో గత ఐదేళ్లుగా గండ్ర తనను శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. కానీ ఈ నెల 3న ఆయనను కలిసేందుకు జీఎంఆర్ అపార్ట్మెంట్కు తాను ఎవరో తెలియనట్టు ప్రవరిస్తూ, తప్పుడు ప్రచారం చేసి నా జీవితం నాశనం చేశాడని ఆమె ఆరోపణలు గుప్పించింది. దీనిపై ఆయనను కలవడానికి ఆగస్టు 3 న జీఎంఆర్ అపార్ట్మెంట్కు వెళ్లగా పోలీసులకు సమాచారమిచ్చి తనను అరెస్ట్ చేయించారని ఆమె ఆరోపించారు. నేనెవరో తెలియదంటూ తన మనుషులతో దాడి చేయించి ఇంట్లోనుంచి గెంటేశాడని, సుబేదారి పోలీసుస్టేషన్లో న్యూసెన్స్ కేసు పెట్టించి అరెస్టు చేయించాడని తెలిపింది. పోలీసులపై కూడా ఆమె ఆరోపణలు చేశారు.
ఆధారంగా ఉన్న రెండు మొబైల్స్ను పోలీసులు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. నా కాల్ డేటా బయటపెడితే నిజాలు బయటకు వస్తాయని పేర్కొంది. రోడ్డుపై ధర్నా చేస్తున్న విజయలక్ష్మిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా వివిధ సెక్షన్ల కింద గండ్ర వెంకటరమణారెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విజయలక్ష్మీ తనపై చేస్తోన్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ఆమె ఆరోపణలు తనను షాక్కు గురిచేశాయని, రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు.
రాజకీయంగా ప్రజల్లో తనకున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక, తనను నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు.. చివరికి ఓ మహిళతో లైంగిక ఆరోపణలు చేయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. డీజీపీ మహేందర్రెడ్డి నిజాయితీ కలిగిన అధికారి అని, నిష్పక్షపాత విచారణ జరిపించి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. అంతే కాదు తన భర్త అలాంటివారు కాదని వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి అన్నారు. తమ పెళ్లయ.. 33 ఏళ్లు అవుతోందని, ఆయన ఎలాంటి వారో తనకు తెలుసునని ఆమె పేర్కొన్నారు.