కీలకమైన ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు మరోసారి కేబినెట్ను విస్తరించబోతున్నారనే చర్చ ఏపీలో హాట్టాపిక్గా మారింది. ఇద్దరు బీజేపీ నేతలు కేబినెట్ నుంచి తప్పుకొన్నాక ఏర్పడిన ఖాళీలను ఇప్పుడు భర్తీ చేస్తారని పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు. దీంతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏ సామాజికవర్గం వారిని తీసుకోవాలి? వారిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కలిగే ప్లస్లు, మైనస్లు.. ఇతర అంశాలపై పార్టీ సీనియర్లతో అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఒకటి మైనారిటీలకు ఇస్తానని గతంలోనే ఆయన చెప్పడంతో మరో స్థానంలో ఎవరు ఇన్ అవుతారనేది ఆసక్తిగా మారింది. అయితే తొలి నుంచి పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీను పేరు బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గెలిచిన ఒకే ఒక్క ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఈసారి మంత్రి పదవి దక్కడం ఖాయమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ మంత్రివర్గాన్ని చంద్రబాబు విస్తరించబోతున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామాతో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ మొదలైంది. రెండు ఖాళీల్లో ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై కొన్ని రోజుల నుంచి చర్చలు జరుపుతున్న చంద్రబాబు.. ఇక దాదాపు కొందరి పేర్లు ఖరారు చేశారని తెలుస్తోంది. వీరిలో మంత్రి పదవి ఎవరు చేపడతారనే విషయం తేలాల్సి ఉంది. ఏపీ కేబినెట్లో మైనార్టీలను స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది.
ఈ నెల 28న గుంటూరులో జరగనున్న మైనార్టీ సదస్సు కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఖాయమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో మైనార్టీ విభాగం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీ షరీఫ్ లేదా ఎమ్మెల్యే చాంద్ బాషాకు పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి ఇవ్వాలన్న యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా కేబినెట్లో ఎస్టీ వర్గానికి చెందిన వారెవరూ లేకపోవడంతో ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్టీ వర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అయితే, వీరిలో గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు వైసీపీ నుంచి రావడంతో మిగిలిన ఇద్దరిలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలోనూ వైసీపీ జెండా ఎగరవేసింది. ఒక్క పోలవరం నియోజకవర్గం మినహా మిగిలిన వాటన్నింటిలో గెలుపొందింది. వైసీపీ నుంచి భారీ పోటీని తట్టుకుని.. పోలవరంలో మొడియం శ్రీనివాసరావు.. సైకిల్ దూసుకెళ్లేలా చేశారు. అంతేగాక ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉండటంతో.. ఆ పనులను కూడా ఎమ్మెల్యే దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో ఒకవేళ ఎస్టీ నియోజకవర్గానికి మంత్రి సీటు కేటాయిస్తే.. మొడియంకే ఇవ్వాలనే డిమాండ్ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలే ఎక్కవగా కనిపిస్తున్నాయని ఆయన అనుచరులతోపాటు పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. మరి సీఎం మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి.