సీఎం చంద్రబాబు మంత్రి బృందంలోని ఓ మంత్రికి సొంత పార్టీ నేతలే పొగబెడుతున్నారట. తనంతట తానుగా పార్టీకి రాం రాం చెప్పేలా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి జంప్ చేసిన ఈయన చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు సంపాయించారు. అయితే, ఆయన పార్టీలో నేతలను కలుపుకొని పోవడం లేదని, ఆయన వల్ల పార్టీ డెవలప్ కావడం లేదని, మంత్రిగా ఉండి కూడా పార్టీని పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నే సదరు మంత్రికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆయన సొంత జిల్లాలో తమ్ముళ్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. విషయంలోకి వెళ్తే.. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సుజయ్ కృష్ణ రంగారావు ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు.
2014లో వైసీపీ టికెట్పై విజయం సాధించిన ఆయన వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విశ్వాస పాత్రుడిగా మారారు. ముఖ్యంగా జగన్ను సమర్ధించిన నాయకుల్లో ఆయన ప్రముఖ గుర్తింపు పొందారు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు వేసిన ఆకర్ష్ గేలానికి చిక్కుకున్నారు. రెండేళ్ల కిందట ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే 2017 ఏప్రిల్లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే, ఆయన వ్యవహార శైలిపై అప్పటి నుంచి బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ నాయకులు పెదవి విరుస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.
మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, తెంటు లక్ష్మునాయుడి వర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నాయి. మంత్రి సుజయ్, నియోజకవర్గ ఇన్చార్జి తెంటు లక్ష్ముంనాయుడు, మంత్రి సోదరుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయనలు బయటకు కలిసిమెలసి పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా ఎవరి వ్యూహాలువారు రచించుకుంటుం డడంతో కార్యకర్తల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అదేస్థాయిలో మంత్రి రంగారావుపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు వ్యతిరేక భావాన్ని పెంచుకుంటున్నారు. ప్రధానంగా గత 15 ఏళ్లుగా మంత్రి రంగారావుపై గ్రామస్థాయిలో పోరాటం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు.
గతంలో మంత్రి రంగారావు కాంగ్రెస్ తరఫున రెండుసార్లు విజయం సాధించి మూడోసారి వైసీపీ నుంచి పోటీచేసి విజయం సాధించి... రెండేళ్ల కిందట టీడీపీలో చేరారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. మంత్రికి ప్రధానంగా అనుచరుడిగా ఉన్న మాజీ ఎంపీపీ బొత్స రవి తీరు టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడనివ్వడం లేదు. తన స్వగ్రామంలో అప్పట్లో వైసీపీ తరఫున కనీసం ఒక్క వార్డు మెంబరును కూడా గెలుపించుకోలేని బొత్స రవికి మంత్రి అంత ప్రాధాన్యత ఇస్తుండడాన్ని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సాగనంపాలని ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా అందాయి. మరి ఏం చేస్తారో చూడాలి.