ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేసిందన్న అపవాదును మూటగట్టుకున్న బీజేపీ షాక్లమీద షాక్లు తగులుతున్నాయి. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇక బీజేపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదనీ.. ఇతర పార్టీల్లోకి వెళ్లడమే మేలని అనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జంప్ అయ్యారు. అయితే.. బీజేపీలో ఉన్న కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకులు టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుని.. టీడీపీ అయితేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. నిజానికి.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేద్దామని కామినేని తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే.. సీట్ల సర్దుబాటు కాకపోవడంతో ఆయన కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ జెండాపై గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ – టీడీపీ పొత్తులో భాగంగా ఆయనకు చంద్ర బాబు కేబినెట్లో వైద్య ఆరోగ్య శామ మంత్రి పదవి దక్కింది. ఇక ఆ తర్వాత కామినేని కూడా చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ శాఖను సమర్థవంతంగా నిర్వర్తించారనే టాక్ రెండు పార్టీల్లోనూ ఉంది. ఆ శాఖకు బాబు కూడా నిధులు కూడా అడిగిన వెంటనే కేటాయించేవారు.
అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పడంతో బీజేపీతో టీడీపీ బంధం తెగిపోవడం.. కేంద్రంలోని ఇద్దరు టీడీపీ మంత్రులు, రాష్ట్రంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేయడం.. తెలిసిందే. ఇప్పుడు కేంద్రంపై చంద్రబాబు యుద్ధమే చేస్తున్నారు. అయితే.. రాజీనామా చేసిన తర్వాత కామినేని శ్రీనివాస్ దాదాపుగా సైలెంట్ అయిపోయారు. రాష్ట్ర బీజేపీలు నేతలు చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా.. కామినేని శ్రీనివాస్ మాత్రం పల్లెత్తుమాట అనడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక ఆయన పార్టీ మారడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై సెప్టెంబర్ మొదటి వారంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. కామినేనిని ఆపేందుకు పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్లు సమాచారం. ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ రాయభారం కూడా విఫలమైందని టాక్. ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల బాపట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్వర్లు బీజేపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు, ఆయన కుమారుడితో సహా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ముందుముందు ఇంకెందరు కదులుతారో చూడాలి మరి.