తెలంగాణలో రాజకీయ వాతావరణంలో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముందస్తు సందడి మళ్లీ మొదలైంది. వచ్చే సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన పేరి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, అదే నెలలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని ఇటీవల టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపుగా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు ఖాయమనే అంచనాకు అన్నిపార్టీలూ వచ్చాయి. మొన్నటికి మొన్న టీపీపీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కూడా డిసెంబర్లోనే ఎన్నికలు వస్తాయంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల కసరత్తును ప్రారంభించారు.
ఫేస్బుక్ లైవ్లో ఆయన మాట్లాడుతూ పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేశారు. అధికార టీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఇదే సమయంలో పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో తెలంగాణ జనసమితి, వామపక్షాలు, టీడీపీ కూడా వేటికవి సిద్ధమవుతున్నాయి. అయితే.. సెప్టెంబర్ నెలలోనే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇందుకు ఓ కమిటీని కూడా వేశారు. అయితే.. అభ్యర్థుల ఎంపికకు కొలమానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సిట్టింగుల్లో వణుకుపుడుతోంది. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చి.. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ కేశవరావు నేత`త్వంలో కమిటీ వేసినట్లు తెలుస్తోంది.
ఏయే నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి..? ఆయా స్థానాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని..? సీట్లు దక్కని సిట్టింగులు పార్టీ మారకుండా ఉండేందుకు, రెబల్గా బరిలోకి దిగకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? అన్నదానిపై కమిటీకి సీఎం కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు పార్టీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ సిట్టింగులతో ముందుగా కేసీఆర్ మాట్లాడుతారనీ, టికెట్లు లభించని వారి రాజకీయ భవిష్యత్కు భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికను పకడ్బందీగా చేపట్టబోతోంది. ప్రతీ నియోజవకర్గానికి ఇద్దరు ముగ్గురి పేర్లను ఎంపిక చేసి.. వారిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాతనే తుది జాబితా రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఆయా నాయకులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల ఆధారంగానే టికెట్లు ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రజాభిప్రాయం, క్యాడర్ అభిప్రాయాలకు భిన్నంగా టికెట్లు కేటాయిస్తే.. గత ఎన్నికల ఫలితాలు రిపీట్ కావడం ఖాయమని చెబుతున్నాయి. ఈసారి అలాంటి లోపాలకు తావులేకుండా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉందట. ఇదే విషయమై.. పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు ప్రజలతో మమేకం అవకావడానికి రెడీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మరింత విస్తృతంగా పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. టికెట్ల కేటాయింపు ఎలాంటి గందరగోళానికి దారితీస్తుందో చూడాలి.