ఏపీ సీఎం చంద్రబాబు కన్నెర్ర చేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు! నాయకులు, అందునా కీలక నాయకులు, మరీ ము ఖ్యంగా పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఆహ్వానాలు వచ్చినా, ఎందరు నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినా కూడా పార్టీని పట్టువీడకుండా పట్టుకుని నెట్టుకొచ్చిన నాయకులపై చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండి పడ్డారు. ఆ ఇద్దరు నాయకుల నుంచి వివరణ కూడా తీసుకోవాలని ఆదేశించారు. మరి ఇద్దరు నేతలు ఎవరు? ఎందుకు సీరియస్ అయ్యారు అనేది ఇప్పుడు నెటిజన్లు వెతుకుతున్న కీలక ప్రశ్న. ఇక, చంద్రబాబు సీరియస్ అయిన వ్యవహారంలో ఒకరిని ఈడియట్ అని సంబోధించడం కూడా సంచలనంగా మారింది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం త్వరలోనే జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తుకు టీడీపీ రెడీ అయిందని పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ పొత్తులపై స్పందించిన ఇద్దరు కీలక నాయకులు కేఈ కృష్ణమూర్తి, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఇద్దరూ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ప్రజలు బట్టలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన ఈ పార్టీని తిరిగి అదే పార్టీలోకి చేర్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన ``రాజకీయ స్వార్థం``తోనే ఈ పనికి పూనుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇక, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. కూడా ఈ పొత్తుపై స్పందించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని, అది పార్టీ విధానానికి విరుద్ధమని కర్నూలులో అన్నారు.
పొత్తులపై పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోకముందే వీరిద్దరూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వారిద్దరినీ పిలిపించి వివరణ కోరాలని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక, ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిని చంద్రబాబు ఇడియట్ అని దూషించడం గమనార్హం. పొత్తుల విషయంలో పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు, దీనిపై అప్పుడే రగడ ఎందుకని చంద్రబాబు పేర్కొంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు వేసిన ప్లాన్ బాగానే సక్సెస్ అయిందని అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్తో పొత్తుపై ఆయన రెడీగానే ఉన్నా.. దిగువ స్థాయి నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యూహాత్మకంగా లీకులు ఇచ్చి.. ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా చేయి దాటి పోకుండా చేసుకుంటున్నారని అంటున్నారు.