ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మహిళా నేత, ఉత్తరాంధ్రకు చెందిన నాయకురాలు.. టీడీపీలో కీలక పదవులు అనుభవించిన కావలి ప్రతిభా భారతి.. ఇక ఇంటి కే పరిమితం కానున్నారా? అనే ప్రశ్నకు బలమైన సమాధానం లభిస్తోంది. వరుస ఓటములతో తీవ్ర అభద్రతా భావంలో ఉన్న ఆమెకు అనారోగ్య సమస్యలు గత కొంతకాలంగా వేధిస్తు న్నాయి. రాజాం నియోజకవర్గం నుంచి 2009, 2014లోనూ ఓటమిపాలయ్యారు ప్రతిభా భారతి. అయితే, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ, జిల్లా రాజకీయాల్లో ఆమె గ్రూపులు కట్టడం, మంత్రి కళా వెంకట్రావుపైనే వ్యతిరే కవ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ఆమె పతనావస్థకు చేరుకున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలోనూ ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు.
అయినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలావుంటే, ఇప్పుడు అదే రాజాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్లో గతంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ను టీడీపీలోకి చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోవడం ప్రతిభా భారతికి పూర్తిగా అడ్రస్ లేకుండా చేయడంలో భాగమేనని అంటున్నారు పరిశీలకులు. మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ టీడీపీలోకి వస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావును కలవడంతో ఆయన సైకులెక్కడం ఖాయమనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించకపోవడంతో ఇక లాంఛనమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ను కూడా కోండ్రు కలిశారు.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోండ్రు ఒకసారి పోటీచేసి గెలిచారు. మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన ప్రభావంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆయన ఓటమి చవిచూశారు. వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి టీడీపీ టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన అన్నిదారులూ సుగమం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా,ఇక్కడ నుంచి తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకోవాలని నిన్న మొన్నటి వరకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన ప్రతిభా భారతి.. ఇక, కొండ్రు రాకతో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి ప్రతిభను ఇంటికి పంపించేయాలని టీడీపీ ఇప్పటికే రెడీ అయ్యింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తోన్న ఆమె గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జోగులు చేతిలో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో గ్రూపు రాజకీయాలతో ఆమె నియోజకవర్గంలో పార్టీని బ్రష్టుపట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచే పరిస్థితి లేదని తేలడంతో ఇప్పుడు ఆమెను తప్పించేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే మురళీని పార్టీలోకి తీసుకునేందుకు రెడీ అయ్యారు.