విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు నివాసంలో పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేశారు. ఆయన కుమార్తెతో పాటు నాగోల్లో ఓ రిపోర్టర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో 8 మంది మావోయిస్టు సానుభూతి పరుల ఇండ్లలో పుణె నగరానికి చెందిన పోలీసులు దాడులు చేశారు. గాంధీనగర్ లో… విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. వరవరరావు కూతురు అనల, ఇప్లూ ప్రొపెసర్ సత్యనారాయణ, జర్నలిస్ట్ కూర్మనాథ్, నాగోల్ లో ఉంటున్న ఫొటో జర్నలిస్ట్ క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం ప్రతినిధుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. సోదాల తర్వాత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేసి పుణెకు తరలించారు.
వరవరరావు ఆరోగ్యం బాగోలేదని కుటుంబసభ్యులు చెప్పగా.. తాము ఆయనకు అవసరమైన వైద్యం అందిస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. కాగా, ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వరవరరావు ఎవరితోనూ సంప్రదింపులు చేయకుండా ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేయించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని స్తాన్ స్వామి ఇంటిపైనా దాడులు చేశారు.
ముంబైలోని అరుణ్ ఫెరీరా, సుసాన్ అబ్రహం, వెర్నాన్ గోన్సాల్వెజ్ ల ఇళ్లలనూ సోదాలు చేశారు. ఢిల్లీలోని గౌతమ్ నవ్లఖాస్, గోవాలోని ఆనంద్ తెల్తుంబ్డే నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఉదయం ఆరు గంటల నుంచే సోదాలు మొదలుపెట్టారు పోలీసులు. ప్రస్తుతం వరవరరావు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే..హక్కులకోసం పోరాడే కార్యకర్తలు, జర్నలిస్టుల ఇళ్లపై దాడులను మానవ హక్కుల సంఘాలు, మావోయిస్టు సానుభూతి పరులు, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు ఖండించారు.