రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎలా ఉంది? అంటే ప్రభుత్వ పరంగా బాగానే ఉందనే సమాచారం వస్తోంది. అయతే, అదే ప్రభుత్వానికి మింగుడుపడని మరో సమాచారం కూడా ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాలోని 13 జిల్లాల్లో కొన్ని జిల్లాలో చంద్రబాబు పాలనపై సంతృప్తి వ్యక్తమవుతుంటే... ఒకే ఒక్క జిల్లాలో మాత్రం టీడీపీకి, ప్రభుత్వానికి కూడా వ్యతిరేక గాలులు వీస్తున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందింది. అది కూడా టీడీపీకి ప్రస్తుతం కంచుకోటగా ఉన్న కర్నూలు కావడం మరింత విస్మయానికి గురి చేస్తోంది. విషయంలోకి వెళ్తే.. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికారపార్టీ నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కర్నూలు నియోజకవర్గం టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఆశిస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కోడుమూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే మణిగాంధీ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్దన్రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎవరి వర్గాలు వారు బలోపేతం చేసుకుంటున్నారు.
పాణ్యం నియోజకవర్గంలో ఓ వర్గం.. నాయకుల తీరుపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో ఇన్చార్జి వీరభద్రగౌడు కలుపుకుని పోతున్నా ఓ వర్గం ఆయనకు సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిల ప్రియ, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీఎం చంద్రబాబు సయోధ్య కుదిర్చినా... క్షేత్ర స్థాయిలో రెండు వర్గాల కార్యకర్తలు కలిసి పనిచేయడం లేదని తెలుస్తోంది. పత్తికొండ, నంద్యాల, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో దశాబ్దాలుగా పార్టీ జెండాను భూజానకెత్తుకుని పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఉంది.
టీడీపీ జెండా పట్టుకుని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ బలోపేతం చేశామని, ఈ నేపథ్యంలో ఎన్నో కష్టాలు పడ్డామ ని, కానీ తమను పార్టీ గుర్తించ డంలేదని కొందరు ద్వితీయశ్రేణి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే నాయకులు కూడా కరువవుతున్నారని సమాచారం. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.