తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికార టీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. శుక్రవారం నుంచి 50రోజుల్లో 100 ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్షాలు కూడా ముందస్తు పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఇందులో మాత్రం అందరిచూపు టీడీపీపైనే ఉంది. తెలంగాణలో టీడీపీ లేనేలేదని అధికార టీఆర్ఎస్ అంటున్నా..లోలోపల మాత్రం ఆ పార్టీతోనే ఏదో ప్రమాదం పొంచివుందనే ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో 15 స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో గ్రేటర్ హైదరాబద్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ గాలిని తట్టుకుని ఆ పార్టీ అన్ని సీట్లు సాధించడానికి ప్రధాన కారణం బలమైన, క్రమశిక్షణ గల పార్టీ క్యాడరే కారణం.
అయితే.. ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. పార్టీ క్యాడర్ మాత్రం అలాగే ఉందని రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే.. టీటీడీపీ నాయకత్వం మాత్రం ఈ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకుసిద్ధమవుతోంది. తెలంగాణలో ఉన్న మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయకుండా... కేవలం బలంగా ఉన్న స్థానాలపైనే దృష్టి సారించి, గట్టి ప్రయత్నం చేయాలని భావిస్తోందట. ఇందులో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్నగర్లపై దృష్టిసారించాలని అనుకుంటున్నారు నాయకులు.
ఇక్కడి నుంచి కనీసం 30 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఇక తామే కింగ్ మేకర్గా అవతారమెత్తుతామని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అన్ని స్థానాల్లో బరిలోకి దిగి గందరగోళంలో పడిపోయేదానికంటే.. కచ్చితంగా గెలిచే స్థానాల్లోనే పట్టుబట్టాలని, ఇందుకు అనుకూలంగా రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయని నాయకులు కసరత్తు ప్రారంభించారు. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో ఒకవేళ కూటమి ఏర్పడితే.. బలంగా ఉన్న సీట్లను తీసుకుని గెలవాలని చూస్తున్నారట. ఎలాగైనా.. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేది టీడీపీయేనని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈనెల 8న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్ర నాయకులతో భేటీ అవుతున్నారు. ముందస్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. పొత్తులు ఉంటే ఎలా..? ఒంటరిగా వెళ్తే.. ఏంచేయాలి..? అన్న అంశాలపై ఆయన పార్టీ నేతలతో కలిసి కసరత్తు చేయనున్నారు. అంతేగాకుండా.. ముందస్తు ఎన్నికల్లో ఆయన కూడా సమయం కేటాయించి, పార్టీ తరుపున ప్రచారం చేస్తారని పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీకి అవసరమైన వనరులు కూడా సమకూర్చుతారని చెబుతున్నారు.