తెలంగాణ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు ఎట్టకేలకు శాసనసభని రద్దుచేసి "ముందస్తు ఎన్నికల" కు సిద్దమయ్యారు. ముందస్తు ఎన్నికలకు అందరి కంటే "ముందస్తుగానే అభ్యర్థుల" ను కూడా ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వ రద్ధు అనంతరం తెలంగాణా భవన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.
శాసనసభరద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యే లకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాబు మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అతడి స్థానంలో స్థానిక జర్నలిస్ట్ చంటి క్రాంతి కిరణ్ కు టికెట్ ఖరారు చేశారు. అందోల్ నియోజకవర్గంలో స్థానికత సెంటింమెంట్ బలపడుతున్న నేపథ్యంలో జర్నలిస్ట్ క్రాంతి టికెట్ కేటాయించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు చెన్నూరు నియోజకవర్గ ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని, ప్రస్తుత ఎంపి బాల్క సుమన్ కు టికెట్ ఖరారు చేశారు.
టిక్కెట్లు దక్కని వారిని పిలిపించి మాట్లాడనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. మేడ్చల్,. మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జాబితాలో చోటు దక్కలేదు.
హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాద సభ తో రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. శాసనసభ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
నూతన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రశంసించారని అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయని విమర్శించారు. స్వల్పకాలం లోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని దేశంలో కెల్లా అతి పెద్ద బఫూన్ గా కేసీఆర్ అభివర్ణించారు. లోక్-సభలో మోదీకి రాహుల్ కన్నుగీటడం, హత్తుకోవడం పట్ల కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ను వారసుడిగా పేర్కొన్న కేసీఆర్.. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని తెలంగాణ ప్రజలను కోరారు.
కాంగ్రెస్, టీడీపీ పొత్తు విషయమై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలి. తెలంగాణ మళ్లీ ఆంధ్రా పార్టీలకు గులాం గిరీ చేయొద్దు. తెలంగాణ వాళ్లే శాసన కర్తలుగా ఉండాలి. ఆంధ్రా పార్టీలతో పొత్తు ఏంటి?’ అని ఆయన నిలదీశారు. ‘ఎన్టీఆర్ కంటే మొగోడా కేసీఆర్ అన్నారు. కావొద్దా..? చెన్నారెడ్డి కంటే మొగోడా అన్నారు. తెలంగాణ తేవడంలో చెన్నారెడ్డి విఫలమైతే.. నేను సాధించాను’ అని కేసీఆర్ తెలిపారు.
అసదుద్దీన్ ఓవైసీ తనంతట తానుగా నాకు ఢిల్లీలోనే ఫోన్ చేసి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, కలిసి పని చేస్తున్నాం. స్నేహపూర్వకంగా పోటీ ఉండొచ్చు. మేం సెక్యులర్ పార్టీ. మజ్లిస్తో కలిసి ఉండే టీఆర్ఎస్తో స్నేహం ఉండదని బీజేపీ అధ్యక్షుడే చెప్పార’న కేసీఆర్ తెలిపారు.
బీజేపీకి దగ్గరవుతున్నామని ప్రచారం చేస్తున్నారు. ప్రధానితో మాట్లాడటం తప్పా? నాకు ఆయనతో చాలా అవసరాలుంటాయి. ప్రధాని మోదీతో నాకుంది ప్రభుత్వమైన అనుబంధమే.
శుక్రవారం హుస్నాబాద్లో జరిగే ప్రజల ఆశీర్వాద సభ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలను వివరిస్తూనే.. తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో కూడా చెప్పబోతున్నారు. ఈ మేరకు మేనిఫెస్టో సిద్ధం చేసేందుకు కమిటీని కూడా నియమించారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు ఛైర్మన్గా 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో పార్టీ సీనియర్లు, ఎంపీలకు స్థానం కల్పించారు.
దేశంలోనే అభివృద్ధిలో నెంబర్-వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లో కమీషన్లు దండుకున్నామని విపక్షాలు బురద చల్లుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అంతకు ముందు మంత్రిమండలి సమావేశంలో శాసన్ అసభను రద్దు చేస్తూ "ఏకవాక్య తీర్మానం" ప్రవేశ పెట్టి ఆమోదించారు. మంత్రి మండలి తీర్మానాన్ని రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్కు సీఎం కేసీఆర్ అందించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదిస్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను గవర్నర్ కోరారు.