హీరో శివాజీ.. మనిషిని చూస్తేనే కానీ. గుర్తించలేని పరిస్థితిలో ఉన్న కథానాయకుడు. ఏదో ఒకటి రెండు చిత్రాలు తీసి.. చేతులు కూడా కాల్చుకున్న ఈయన రాజకీయాల్లోకి రావాలని తపన. ఏదో విధంగా మీడియాలో ఉండాలనే ఆలోచన. దీంతో ఎప్పటికప్పుడు సంచలనం సృష్టించేందుకు ప్రయత్నించి చతికిల పడతాడు. గతంలో సమైక్య రాష్ట్రం పేరిట ఏర్పడిన సంస్థలోనూ ఈయన పనిచేశారు. ఇక, ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున సంచలనాలతో కూడిన ప్రకటనలు చేశాడు. ప్యాకేజీకి ఒప్పుకుంటే.. చంద్రబాబు ఇంటిముందే తాను చచ్చిపోతానని భీషణ ప్రతిజ్ఞలు చేసి.. ఆనక మీడియా కంట పడకుండా తప్పించుకున్నాడు కూడా.
ఇక, ఆ తర్వాత మళ్లీ.. `ఆపరేషన్ గరుడ` పేరుతో ఆయన పెద్ద సంచలనమే సృష్టించాడు. మీడియాను పిలిచి ఓ రెండు గంటలపాటు పెన్నులు, బోర్డులపై గ్రాఫులు గీసి మరీ పెద్ద ఆరోపణలు చేశాడు. ఇది కూడా తుస్సు మనేసరికి మళ్లీ తెరచాటుకు పోయాడు. ఇక, ఇప్పుడు మళ్లీ.. ఆపరేషన్ గరుడ మరోరూపంలో వస్తోందని వ్యాఖ్యానిస్తూ.. ఏదో జోస్యం చెప్పాడు. ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్రం పావులు కదుపుతోందని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, నటుడు శివాజీ పేర్కొన్నారు. సోమవారమే ఆయనకు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందే అవకాశముందని తెలిపారు. ఇది తనకు విశ్వసనీయంగా అందిన సమాచారమని... ఇప్పుడు అది బయటికి పొక్కినందున నాలుగైదు రోజులు ఆలస్యంగా నోటీసులు జారీ చేయవచ్చునని చెప్పారు.
‘‘ఆపరేషన్ గరుడ మరో రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్పై దాడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబును ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలైంది’’ అని శివాజీ తెలిపాడు. కేంద్రాన్ని ఢీకొట్టడమే దీనంతటికీ కారణమని తెలిపారు. ‘‘కేంద్రం పంజా విసరనుంది. వారిది సమయం చూసి దాడిచేసే నైజం. వారికి చట్టం చుట్టంలాంటిది. సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం నా దగ్గర ఉంది. కానీ, దానిని బయటపెట్టను. అని ముక్తాయించాడు. వాస్తవానికి కేంద్రాన్ని ఢీకొట్టిన సీఎంలలో చంద్రబాబు ఎన్నోవారు? అని గనుక చర్చించుకుంటే.. దీనికి ముందు చాలా మందే ఉన్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దేశం నుంచి మోడీని తరిమి కొట్టండి! అని పిలుపు ఇచ్చారు. మోడీ విధానాలపై ప్రభుత్వం తరఫునే పెద్ద పోరాటం చేశారు. ఇక, బాబు కన్నా ముందుగానే ఆప్ నాయకుడు కేజ్రీవాల్ కూడా మోడీపై యుద్ధం చేసిన వాడే.. చేస్తున్నవాడే..! ఇక, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, వంటి వారు సైతం మోడీనిగతంలో తీవ్రంగా వ్యతిరేకించిన వారే. మరి వీరెవరిపైనా లేని ఆపరేషన్లు.. ఇప్పటికిప్పుడు బాబుపై చేస్తారంటే.. ఇదేదో నమ్మకానికి చాలా దూరంలో ఉంది!! ప్రస్తుతం చంద్రబాబుకు సింపతీ కావాలి. ఆయనను ఏదోఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టాలి! ఈ క్రమంలోనే ఇప్పుడు ఇలాంటి వి వెలుగు చూస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.