ప్రతిష్ఠాత్మక పోలవరం నిర్మాణంలో నేడు మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టులో ఇప్పటికే పలు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తికాగా, తాజాగా స్పిల్వే గ్యాలరీ వాక్ను సిద్ధం చేశారు. ఈ ఉదయం 10:05 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించనున్నారు. చరిత్రలో ఇది మరపురాని ఘట్టంగా నిలవబోతుందన్నారు. పోలవరం డ్యామ్కు గుండెకాయ వంటి ఈ గ్యాలరీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ పోలవరం పనుల్లో 58.15 శాతం పూర్తిచేశామన్నారు. డామ్ నిర్మాణానికి రూ. 14,600 కోట్లు వెచ్చించామన్నారు.
ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 9,464 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. ఇందులో రూ. 2,736 కోట్ల మేర పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా తిరిగి చెల్లింలపులు జరగాల్సి ఉందన్నారు. అంతేకాకుండా డీపీఆర్-2 కూడా ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం ఆదేశించారు.
ప్రారంభానికి 20 నిమిషాల ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం చేరుకోవాలంటూ మంగళవారం సీఎంవో ఆహ్వానాలు పంపింది. గ్యాలరీ వాక్ను ప్రారంభించిన అనంతరం 48వ బ్లాక్లోకి చంద్రబాబు ప్రవేశించి 36వ బ్లాక్ వరకు నడుస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చి బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. అంతే కాదు కార్యక్రమానికి హాజరుకానున్న 5 వేల మంది సందర్శకులతో చంద్రబాబు సమావేశమవుతారు.
ఇదిలా ఉంటే నేడు విజయవాడ నుంచి పోలవరం సందర్శన కు బయలుదేరిన టీడీపీ ఎమ్యెల్యే ల పర్యటన కు ఆటంకం కలిగింది. ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలో రోడ్డు పక్కన మట్టిలో దిగింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాక పోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. బస్సు లో ఉన్న 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరే వాహనాల్లో పోలవరానికి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అలర్ట్ కావడం..ముఖ్యనేతలను సురక్షితంగా బయటకు పంపండంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.