అవును! ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాజకీయ నేతల వరకు అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్నా చితకా వేషాలు వేసుకునే ఆర్టిస్టు నుంచి ఓ మాదిరి హీరో వరకు ఎదిగినా.. అన్నీవిఫలమయ్యాయనే పేరు తెచ్చుకు న్న హీరో శివాజీ ఇప్పుడు రాజకీయంగా కామెంట్లు చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా.. 2014 నుంచి మాత్రం ఏపీ తెరమీద కనిపిస్తున్నాడు. ఆయన ఏపార్టీలోనూ చేరడు.. కానీ, అన్ని పార్టీల నాయకులను విమర్శించ డం మాత్రం చేస్తుంటాడు. మొదట్లో సమైక్య ఆంధ్ర సాధన సమితిని ఏర్పాటు చేసిన వారిలో ఒకడిగా ఉన్నా.. రానురాను ఆ నాయకులను మించిపోయాడు. రాష్ట్రం విభజనే జరగకూడదని చెప్పాడు. అది ఆపడం కుదరకపోయేసరికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పాట అందుకున్నాడు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తు న టీవీల్లోకి వచ్చి.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, చంద్రబాబు ప్యాకేజీ అమ్ముడు పోయాడని పెద్ద ఎత్తున 2016లో హడావుడి సృష్టించాడు. అయితే, ఈ విషయంలో చంద్రబాబు పట్టించుకోలేదు, దీంతో మరింత దూకుడుగా చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుంటే.. చంద్రబాబు ఇంటి ముందు శవమై కూర్చుంటానని శపథం చేశాడు. అయినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాదు, సినిమా ఛాన్స్లు లేకే ఇలాకాలుకాలిన పిల్లిగా మారిపోయాడని విజయవాడలో టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో దుయ్యబట్టాడు. మరి ఇంతలోనే ఏమైందో కొన్నాళ్లు మౌనంగా ఉన్న శివాజీ.. అనూహ్యంగా ఓ ఆరు నెలల కిందట మళ్లీమీడయా ముందుకు వచ్చాడు.
ఈ సారి ఏకంగా చంద్రబాబుకు సపోర్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఏదో ప్యాకేజీకి చంద్రబాబు పడిపో వడం కాదు.. బాబు ఇచ్చిన ప్యాకేజీకి శివాజీనే పడిపోయాడనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సరే వీటి పని ఎలా ఉన్నా.. శివాజీ మాత్రం మొదట్లో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని చంద్రబాబు ద్రోహం చేశాడని అని.. ఇప్పుడు మాత్రం ఆయన పట్ల కన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబుకు ఏదో అయిపోతోందని, ఆపరేషన్ గరుడ పేరుతో ఆయనను జైలుకు పంపించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తున్నారని పెద్ద ఎత్తున గ్రాఫులు, బ్లాక్ బోర్డులు పెట్టి వివరించాడు. అయితే, ఇది జరిగి నాలుగు నెలలైనా.. ఇప్పటి వరకు ఏం జరగలేదు. అయితే, తాజాగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది పెద్ద సంగతే కాదు. మొత్తానికి శివాజీ.. బాబుకు సపోర్టుగా మారాడనే విషయం ఈ ప్రత్యేక హోదా తెరచాటున జరిగిందన్నది స్పష్టమవుతోంది.