అధికారం చేతిలో ఉంటే.. తిమ్మిని బమ్మిని చేయొచ్చు! అనేది తెలియందికాదు ఇప్పుడు ఇలాంటి ఘటనే ఏపీలోనూ చోటు చేసుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి పుష్కరాల సమయంలో తీవ్రమైన తొక్కిసలాట జరిగి దాదాపు 27 మంది మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లోనే తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా? ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా భద్రత కల్పించాలి కదా? కానీ, చంద్రబాబు అలా చేశారా? అంటే అంతా ప్రశ్నలే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై నియమితులైన సోమయాజులు నివేదిక ప్రభుత్వానికి అందింది. దీనిలో చంద్రబాబు తప్పు అణుమాత్రం కూడా లేదని పేర్కొంది.
దీనిని బట్టి చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని చెప్పడానికి సోమయాజుల కమిటీ నిదర్శంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని నివేదిక స్పష్ట్ం చేయడం గమనార్హం. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి నదిలో స్నానం చేసే వరకు జనాలను నిలిపి ఉంచారని కమిషన్ అభిప్రాయపడింది. 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని కమిషన్ తేల్చిచెప్పింది. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2015లో 144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి హద్దుమీరిన ఉత్సాహంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.
ముహూర్త కాలంపై విస్తృత ప్రచారమే ప్రమాదానికి ప్రధాన కారణమని, ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పవిత్ర స్నానం చేయాలనే నిబంధన ఎక్కడాలేదని తెలిపింది. పత్రికలు, చానళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని వెల్లడించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని కమిషన్ అభిప్రాయపడిం ది. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది.
ప్రచారం, రాజకీయ లబ్ది కోసమే చాలామంది ఆరోపణలు చేసినట్టు అభిప్రాయపడింది. ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300మీటర్లు మాత్రమే ఉండటం, పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం వల్లే జనం రద్దీ విపరీతంగా పెరిగిందని తెలిపింది. అయితే, అదేసమయంలో కమిషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్య పరుస్తోంది. స్వతంత్ర అభిప్రాయం వ్యక్తీకరించకుండా చంద్రబాబు పక్షాన వకాల్తా పుచ్చుకున్నట్టుగా కమిషన్ వ్యవహరించడం గమనార్హం.