తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే టికెట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకు రెడీ అవుతుంది. మరో వైపు విపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో తలమన‌కలౌతోంది. ఈ క్రమంలోనే ఎవరు ఎక్కడ పోటీ చేయాలి...తొలి లిస్ట్‌లో ఎవరెవరి పేర్లు ఉండాలి అనేదానిపై ఏఐసీసీ ప్రాధమిక కసరత్తులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఎన్నిక‌ల కోసం ఏఐసీసీ వేసిన క‌మిటీల మీద పెద్ద దుమార‌మే రేగుతోంది. ఈ వివాదాల న‌డుమే మరో నాలుగు, ఐదు రోజుల్లోనే తొలి జాబితా రిలీజ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యినప్పటి నుంచి ఓ వెలుగు వెలిగిన మాజీ హోంమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే అవుననే ఆన్స‌ర్‌ వస్తోంది. 


2000లో భర్త ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన స‌బిత చేవెళ్ల నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2004లో కూడా అక్క‌డ విజయం సాధించారు. 2009లో చేవెళ్ల ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో ఆమె మ‌హేశ్వ‌రంకు మారి అక్క‌డ కూడా గెలిచారు. 2009 తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన హోం శాఖా మంత్రిగా ఉన్నారు. హోం శాఖా మంత్రిగా నాటి ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆమె గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. సబిత కుమారుడు కార్తిక్‌రెడ్డి చేవెళ్ల నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సబిత వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 


ఈ క్రమంలోనే పార్లమెంటుకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న ఆమె చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్‌ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌ అసెంబ్లీ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఏదేమైనా ఈ సారి తల్లీ, కొడుకుల్లో తల్లి పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుంటే... కొడుకు అసెంబ్లీ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.

అయితే టీ కాంగ్రెస్‌లో ఇప్ప‌టికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. సీట్ల సంఖ్య త‌క్కువుగా ఉంది. పొత్తుల నేప‌థ్యంలో చాలా మంది సీనియ‌ర్లు సైతం టిక్కెట్లు త్యాగం చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి ఇంత ట‌ఫ్ కాంపిటేష‌న్ నేప‌థ్యంలో త‌ళ్లీ, కొడుకుల‌కు ఇద్ద‌రికి సీట్లు వస్తాయా ? అన్న‌ది డౌటే. ఇక టీ కాంగ్రెస్‌లో సైతం ఒక ఫ్యామిలీకి ఒకే సీటు నిబంధ‌న ఉంటే వీళ్లిద్ద‌రిలో ఒక‌రు సీటు త్యాగం చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: