అంబ‌టి రాంబాబు.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైఎస్సార్‌సీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌కు తొలి నుంచి న‌మ్మిన బంటు! వైఎస్ కుటుంబానికి వెన్నంటే ఉన్న ఒకే ఒక్క నాయ‌కుడు. జ‌గన్ క‌ష్టాల‌ను త‌న క‌ష్టాలుగా భావించి.. ఎల్ల‌వేళ‌లా జ‌గ‌న్‌కు అండగా నిలుచున్న వ్య‌క్తి. ఎన్న‌డూ ప‌ద‌వుల గురించి ఆలోచించ‌కుండా.. నిస్వార్థంగా ప‌నిచేస్తున్న నాయ‌కుడు. గ‌త ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ మెజారిటీతో ఓడిపోయిన ఆయ‌న‌కు.. ఈసారి త‌న‌కు టికెట్ ద‌క్కుతుంద‌ని ఎంతో ఆశ పెట్టుకున్న వ్య‌క్తి. అలాంటి న‌మ్మిన బంటుకి ఇప్పుడు జ‌గ‌న్ షాకుల‌మీద షాకివ్వ‌బోతున్నారు. ఆయ‌న‌కు టికెట్ ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం ఆయ‌న‌లో స‌న్న‌గిల్లిపోతోంది. పార్టీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌య‌మే ఇప్పుడు.. ఆయ‌న టికెట్ ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేసేస్తోంది. కాపు సామాజిక‌వ‌ర్గ‌మంతా వైసీపీకి దూర‌మ‌వుతున్న త‌రుణంలో.. ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికి ఇచ్చే టికెట్ల‌లో కోత విధించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ట‌. దీంతో అంబ‌టి సీటుకు ఎస‌రు ప‌డే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయ‌ని అంటున్నారు. 


కాపు సామాజిక‌వ‌ర్గం నానాటికీ వైసీసీకి దూర‌మవుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా జ‌న‌సేన.. కాపు ఎజెండాతోనే బ‌రిలోకి దిగ‌బోతోంద‌నే విష‌యం అంద‌రికీ అర్థ‌మైపోయింది. ఆ పార్టీకి ఇప్పుడు కాపులు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని.. గ్ర‌హించిన ఇత‌ర పార్టీల నేత‌లు ఇప్పుడు ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల‌పై దృష్టిసారిస్తున్నాయి. కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌కు ఇన్నాళ్లూ టికెట్లు ఇద్దామనే ఆలోచ‌న‌లో ఉన్నా.. ఇప్పుడు దానిని విర‌మించుకుంటున్నార‌ట. తొలి నుంచి కాపు సామాజికవ‌ర్గంపైనే దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. ఇప్పుడు వెన‌క‌డుగు వేస్తున్నారట‌. జనసేన, వామపక్షాలు కలసి ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారికి గతంలో కేటాయించాలనుకున్న ఎమ్మెల్యే సీట్లలో భారీగా జగన్‌ కోత విధించబోతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. 


మెజార్టీ కాపులు జనసేన వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ ఇతర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 'జగన్‌' ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాపు రిజర్వేషన్లు పరిధి కేంద్రంలో ఉందని తప్పుకున్నారు. ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో మాట మార్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి పోలైన ఓట్లను ఆయన పరిశీలిస్తూ.. ఇతర వర్గాలకు చెందిన ఓటర్లపై ఆయన దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 2014లో ఓడిపోయిన అంబటి రాంబాబును తప్పించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నాయి. గుంటూరు జిల్లాలో గతంలో రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చామని.. ఈసారి ఒకటీ రెండు కోత పెట్టాలని జగన్‌ భావించినా తాజా పరిస్థితుల్లో మరో రెండు సీట్లు ఎక్కువ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 


కాపు సామాజికవర్గానికి కోత విధించి బీసీ వర్గాలతో పాటు ఇతర వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నార‌ట‌. ఈ నేపథ్యంలో అంబటి మాత్రమే ఆ పార్టీలో ఉన్నారని మిగతా వారంతా జనసేనలో చేరిపోతున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు భారీగా నిధులు ఇచ్చారు. అసెంబ్లీలో రిజర్వేషన్‌ కోసం బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపారు. కానీ ఆ సామాజికవర్గం పవన్ వైపే ఉందని ఇంత చేసినా చంద్రబాబునే వారు పట్టించుకోవడం లేదని, ఏమీ చేయని జగన్‌ను వారెందుకు పట్టించుకుంటారని వాదిస్తున్నారు.  దీంతో ఇతర వర్గాలను ఆకట్టుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యం తగ్గించి ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత పెంచే నిర్ణయం సత్ఫలితాలు ఇస్తాయా? లేదా? కాపుసామాజికవర్గం వ్యతిరేకత పూర్తిగా నష్టం చేకూరుస్తుందేమో వేచిచూడాల్సిందే! 


మరింత సమాచారం తెలుసుకోండి: