కేవలం తమ కులానికి చెందిన వాడు కాదని..కన్న కూతురు గర్భవతి అని తెలిసి కూడా ఆమె భర్తను అన్యాయంగా చంపించిన మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతిరావు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది ప్రణయ్ హత్య. ప్రణయ్ హత్యతో రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం అలుముకుంది. అన్యాయంగా ప్రణయ్ను చంపారనే వాదనలు బలంగా వినిపించాయి. ప్రణయ్ను చంపిన తన తండ్రికి తప్పకుండా శిక్ష పడాలని అమృత వర్షిణి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే..తమ ప్రేమకు అన్యాయంగా బలైందని..ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోవొద్దని అందుకు ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అమృత వాదిస్తుంది. ఆమెకు మద్దతుగా పలువురు సంఘం నాయకులు..సానుభూతి పరులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై మిర్యాలగూడలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.తల్లిదండ్రుల సంఘం పేరుతో వీరు మిర్యాలగూడలోని మినీ రవీంద్ర భారతి వద్ద సమావేశం ఏర్పాుట చేసిన విషయం తెలిసిందే.
వారి వాదన ప్రకారం..ఇది రెండు కుటుంబాల మధ్యలో జరిగిన సమస్య అని, దీన్ని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సరికాదని వారు వాదించారు. భవిష్యత్ లో మరిన్ని వివాదాలు తలెత్తుతాయని వారు అంటున్నారు. అయితే మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమృత ఈ విషయంలో చాలా గట్టిగా వాదిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రణయ్ విగ్రహం పెట్టాల్సిందే అని వాదిస్తోంది.. ‘నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే.
భవిష్యత్తులో ఇకపై కుల హత్యలు జరకుండా హెచ్చరించాలన్న ఉద్దేశ్యంతోనే విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాం. విగ్రహం ఏర్పాటును నా తండ్రి మారుతీరావు అనుచరులే అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులను సంప్రందించి అనుమతులు కోరుతాను. అడ్డంకులు ఎదురైతే విగ్రహ ఏర్పాటు స్థలంలోనే నిరసనకు దిగుతాను’ అని హెచ్చరించింది.