మొన్నామద్య కేరళాలో వరుసగా కురిసిన వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు..దాదాపు నాలుగు వందల మంది వరకు మృత్యువాత పడ్డారు. కేరళాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కేరళా బాధలు మరువక ముందే.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో దోభీ ఫోజల్ ప్రాంతంలోని కులూ, మనాలీ ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. వరదనీటితో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజాగా భారీ వర్షాలతో మండీలోని బీయాస్ నది చండీగడ్ – మనాలీ జాతీయ రహదారిని ముంచెత్తింది. పలుచోట్ల వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. బియాస్ నది పక్కన పార్క్ చేసివున్న టూరిస్టు బస్సు వరద పెరగడంతో అకస్మాత్తుగా నదిలో కొట్టుకుపోయింది. చూస్తుండగానే బస్సు కాగితపు పడవలా నదిలో కొట్టుకుపోయింది.
అక్కడున్నవాళ్లంతా భయాందోళనలకు గురయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు వరదనీటితో డ్రైనేజీ కాల్వలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కులూ ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకున్న 19 మందిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళం కాపాడి హెలికాప్టరులో సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.