రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపు వేడి కూడా రాజుకుంది. నేతలు ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే, అధికార పార్టీలో ఈ టికెట్ల వేదన భారీగా ఉంది. నేతలు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో సిట్టింగులు సైతం టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే, అధికార పార్టీలో సిట్టింగు ఎమ్మెల్యేలు అందరికీ కూడా టికెట్లు లభిస్తాయనే అవకాశం కూడా లేదని ఇప్పటికే స్పష్టమైంది. దీంతో దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఇలా ప్రకాశం జిల్లాలో సీటు కోల్పోతారని భావిస్తున్నవారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు! దీనికి ప్రధాన కారణం.. ఆయన ఎన్నికల్లో నెగ్గినప్పటి నుంచి కూడా ప్రజలను వదిలేసి.. తన సొంత వ్యవహారాలేచూసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. ప్రజల కోసం, ముఖ్యంగా వెనుక బడిన జిల్లాఅయిన ప్రకాశంలో ప్రజల కోసం చంద్రబాబు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావు వాటిని అందిపుచ్చుకుని ప్రజల్లో మంచి గుర్తింపు సాధించాల్సిందిపోయి.. తాను తన వ్యాపారాలనే చూసుకోవడం ప్రతి పనిలోనూ కమీషన్లు చూసుకోవడం వంటి వి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
కదిరికి చంద్రబాబు బాలకృష్ణ ఒత్తిడి మేరకే సీటు ఇచ్చారన్నది ఓపెన్ సీక్రెట్. 2004లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కదిరికి 2009లో కనిగిరి సీటు ఇచ్చినా ఆయన నామినేషన్ చెల్లకపోవడంతో పోటీ చేసే చేయలేదు. గత ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచినా ఆయన చేసిందేమి లేదు. పైగా ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ కదిరికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు స్పష్టంగా తెలిసింది. దీంతో ఎమ్మెల్యే బాబూరావు పనితీరుపై సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్తాయిలో మండిప డినట్లు సమాచారం. కమీషన్ల వ్యవహారంతోపాటు బాబూరావు కనిగిరిలో ప్రజలకు అందుబాటులో ఉండక హైదరాబాదులో ఉంటుండడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇలాగైతే.. వచ్చే ఎన్నికల్లో జాతకాలు మారిపోతాయని కూడా ఆయన హెచ్చరించారు. అయినా కూడా బాబూరావు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలావుంటే, మరోవైపు ఇప్పటికే కనిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉగ్ర సీఎంతో సైతం పలుమార్లు సమావేశమయ్యారు. ఉగ్రను టీడపీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సారి బాలయ్య చెప్పినా కదిరికి టిక్కెట్ ఉండదంటున్నారు. మరి కదిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.