రాజకీయాల్లో ప్రత్యర్థులను అణిచి వేసేందుకు కాంగ్రెస్ హయాంలో వేసిన మంత్రం.. ఐటీ, ఈడీ వంటి సంస్థలను తమకు అనుకూలంగా వినియోగించుకోవడం! రాజకీయంగా తమకు ఎవరైనా ఎదురుతిరిగితే.. కాంగ్రెస్ హయాంలో ఆయా నేతల పై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఐటీ, ఈడీ వంటివాటిని విస్తృతంగా వినియోగించేవారు. ఈ క్రమంలోనే 2012లో కాంగ్రెస్ అప్పటికి తమను ఎదిరించిన దివంగత వైఎస్ తనయుడు, ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడు జగన్పై సీబీఐ సహా ఐటీ, ఈడీలను ప్రయోగించింది. ఆయన ఇప్పటికీ ఈ కేసుల నుంచి బయట పడలేదు. కొందరు ఈ కేసులు ఇట్టే తేలిపోతాయని అంటున్నారు. నిజానికి ఈ కేసుపై హైకోర్టుకు లేఖ రాసిన కాంగ్రెస్ అప్పటి ఎమ్మెల్యే శంకర్ రావు కూడా జగన్పై తాను అనవసరంగా హైకోర్టుకు లేఖ రాశానని పలు సందర్భాల్లో పేర్కొనడం గమనార్హం.
ఇప్పుడు కూడా తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వానికి కంట్లో నలుసు మాదిరిగా ఉన్న కాంగ్రెస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మె ల్యే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం దీనిలో భాగంగానే చెబుతున్నారు విశ్లేషకులు. గురువారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినీతి, మనీ లాండరింగ్, నిధుల సేకరణ, లెక్కలు చూపకపోవడం వంటివివిధ కారణాలతో ఆయనపై దర్యాప్తు చేపట్టారు. అయితే, ఏం జరిగిందనేది ప్రజలకు కానీ, రాజకీయ నేతలకు కానీ, ఇప్పటికీ తెలియకపోయినా.. ఈ విషయంలో రాజకీయ ప్రమేయం మాత్రం ఉందనేది వాస్తవం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రేవంత్ వంటి బలమైన నాయకుడు ప్రజల మధ్య ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని టీఆర్ ఎస్ అదినేత,ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఉప్పందించారని, రేవంత్ను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా ఆయన అధికారులను లైన్లో పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన బిజీ గా ఉన్న రేవంత్ను ఐటీశాఖ దాడులు కరవర పరిచేవే. అయితే, ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తాను జైలుకు వెళ్లినా.. నామినేషన్ వేస్తానని చెబుతున్నారు. అంటే.. జైలుకు పంపించేందుకురేవంత్పై పెద్ద ఎత్తున కుట్ర జరిగిందనే వ్యాఖ్యలను ఈ మాటలు నిజం చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. నేరుగా తమను తామ ప్రొజెక్టు చేసుకోవడం ఒక దారైతే.. కాంగ్రెస్ చూపిన బాటలో ప్రత్యర్థిని న్యాయ వ్యవస్థలో ఇరికించడం మరో దారి.. బహుశ కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే అనే అనుమానాలు తాజాగా నిజం అవుతుండడం గమనార్హం.