కొండా దంపతులు! తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ఏపీలోనూ చిరపరిచయమున్న నాయకులు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన సురేఖ.. తదనంతర పరిణామాల నే పథ్యంలో వైఎస్ జగన్కు చేరువ అయ్యారు. తర్వాత మంత్రి పదవిని సైతం వదులుకుని.. వైసీపీలోకి చేరిపోయారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఆమె వైసీపీకి కూడా గుడ్ బై చెప్పి.. ఆమె టీఆర్ ఎస్ కారెక్కారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించిన భంగ పడిన ఆమెకు ఇప్పుడు తాజా పరిణామాల్లో టికెట్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. తాజాగా అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ వచ్చి కాంగ్రెస్ చెట్టు కిందకే చేరారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరికి పట్టున్న పరకాల నియోజకవర్గం వీరికి లభిస్తుందా? లేదా వేరే చోటకి వెళ్లాలా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. గత ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ దఫా కూడా ఆమె అక్కణ్నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తూర్పుతో పాటు పరకాల సీటును కూడా తమకే కేటాయించాలని కొండా దంపతులు అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. రెండు సీట్లు వస్తే.. ఒకచోట తాను - మరోచోట తన భర్త మురళి లేదా తమ కుమార్తె సుస్మితా పటేల్ను బరిలోకి దింపాలన్నది కొండా దంపతుల యోచన.
ఇందులో భాగంగానే వారు పరకాల టికెట్ కోరుతున్నారు. వాస్తవానికి టీఆర్ ఎస్లో వీరికి చిచ్చు పెట్టింది కూడా ఈ నియోజకవర్గమే అనే ప్రచారం సాగుతోంది. గతంలో తాను అక్కణ్నుంచే విజయం సాధించానని.. ఆ టికెట్ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని సురేఖ విశ్లేషిస్తున్నారు. అయితే, పరకాల టికెట్ అంత తేలికగా కొండా కోటరీలోకి వచ్చి చేరే సమస్య లేదని అంటున్నారు. కొండా దంపతులు టీఆర్ ఎస్ లోకి వెళ్లాక.. ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరకాలలో కాంగ్రెస్ కు అన్నీ తానై వ్యవహరించారు. తాను నాలుగున్నరేళ్లుగా పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ వస్తున్నానని.. ఇప్పుడు తనకు టికెట్ ఇవ్వకుంటే అన్యాయం చేసినట్లేనని ఇనగాల వాదిస్తున్నారు.
అంతేకాదు.. తనకు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా.. ఇక్కడ కాంగ్రెస్ను ఓడించి తీరుతానని ఆయన తన అనుచరులతో ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొండా దంపతులకు ఈ సీటు విషయంలో వెనక్కి తగ్గాలనే సూచించినట్టు సమాచారం. కాబట్టి ఏ కోణంలో చూసినా.. కొండా దంపతులకు పరకాల సీటు దక్కే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వీరు దీనిని వదులుకుని ముందుకు వెళ్తారా? ఏం చేస్తారు? అనేది ప్రశ్నగా మారింది.