పొరుగున ఉన్న తెలంగాణ రాజకీయాల విషయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్ నాయకు లు బీజేపీతో చెలిమి ప్రారంభించారని అన్నారు. అయితే, దీనిని అప్పట్లో కొందరు చాలా లైట్గా తీసుకున్నారు. చంద్రబాబు ఊసుపోక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇక, అదేసమయంలో టీఆర్ ఎస్ అదినేత, ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు మరింత డిఫరెంట్గా ఉన్నాయి. తాము బీజేపీతో జతకట్టుడు ఏంది? అని ఆయన గవర్నర్కు ప్రభుత్వ రద్దుపై నోటీసులు అందించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. తమది ఉత్తరం అయితే, బీజేపీది దక్షిణం అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు, తాము హైదరాబాద్లో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ(బీజేపీకి బద్ధ వ్యతిరేకి)తో కలిసి మెలిసి ఉన్నామని, తమ ఫ్రెండ్లీ పార్టీ(పొత్తు పార్టీ కాదు) అని, మజ్లిస్ బలమైన రాజకీయాలు చేస్తోందని కొనియాడారు. దీనిని బట్టి ఆయన బీజేపీకి కడు దూరం అనే సంకేతాలను పంపారు. అక్కడితోకూడా ఆగని కేసీఆర్.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తమకు సెక్యులర్ రాజకీయాలు మాత్రమే తెలుసనని, బీజేపీకి సెక్యులర్ రాజకీయాలు తెలియవని దుయ్యబట్టారు. దీంతో అప్పటి కి అందరూ బీజేపీతో కేసీఆర్ చెలిమి చేయడం లేదని అనుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏపీలో చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేకుండా పోయాయి.
అయితే, తాజా పరిణామాలను ముఖ్యంగా గురువారం ఉదయం నుంచి తెలంగాణ లో జరుగుతున్న పరిణామలను గమనిస్తే.. కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనే విషయాలను బలపరుస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ఇటవల చేసిన వ్యాఖ్యలు నిజమేమో అనే రీతిలో ఉంటున్నాయి. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత, బలమైన గళంగా ప్రజల్లో కేసీఆర్ను ముప్పుతిప్పలు పెడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
నిజానికి ఐటీ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ. కానీ, ఇప్పుడు రేవంత్ ఇంటిపై దాడి చేస్తున్నదీ అంటే.. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కొట్టివేయడానికి అవకాశం లేదు. ఎన్నికల సమయంలోనే రేవంత్ ఐటీ విషయాలపై అధికారులు దృష్టి పెట్టడం మరింత విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే.. తనకు బద్ధ శత్రువులను ఏరివేసేందుకు, ఎన్నికల్లో తనకు అడ్డు రాకుండా చేసుకునేందుకు కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపారనే సందేహాలకు అవకాశం లభిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.