భారత జాతి ఆది అంతం లేని సనాతన జాతి. సనాతన అంటే "శాశ్వతం" అని అర్థం. ఒక జాతికి కొన్ని నీతి నియమాలతో కూడిన జీవన విధానం ఉంటుంది. ఈ సనాతన జాతికి శాశ్వతమైన నీతి నియమాలు ఉన్నాయి. వాటిలో వివాహ వ్యవస్థ ఒకటి. గృహాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఒక స్త్రీకి ఒకే భర్త అలాగే ఒక భర్తకు ఒక భార్య అనే నైతికత్వం నిబిడీకృతమైనది. అలాంటి సనాతన నైతిక నియమాలలో ఒకటి ముఖ్యమైనది వ్యభిచరించకపోవడం."వ్యభిచారం ఒక పాతకం - పాపం" అన్నది యుగాంతరాళాల్లో భారతీయ జీవన విధానంలో నిహితమై జాతి జీవ స్రవంతిని నడిపిస్తున్న ఉన్న నైతిక నియమం.
అయితే వ్యభిచరించడం నేరంకాదని నేడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఇటీవల చేసిన నిర్ణయం సనాతన జాతీయ జీవన ప్రస్థాన క్రమంలో గొప్ప సంచలనం మాత్రమే కాదు జనహృదయాల్లో కలకలం కల్లోలం రేపింది.
భారతీయ శిక్షాస్మృతి లోని ఈ 497వ నిబంధన గృహస్థాశ్రమ ధర్మానికి వివాహవ్యవస్థకు వెన్నెముక జాతీయ జీవన నైతికతకు నిష్ఠకు ఒక ప్రతీక. జీవన ప్రగతి ప్రస్థానంలో ‘నీతి నియమాలు నిబంధనలు’ సుఖ సంతోష శాంతి భద్రతలను సాధించడానికి వీలు కలిగించే మాధ్యమాలు! అవసరాలకోసం సౌలభ్యంకోసం నియమ నిబంధనలు మారవచ్చు, కానీ జాతీయ జీవన మౌలిక స్వభావం మారదు.
Husband is not master of woman’: What the Supreme Court said in its verdict
అలా మారినట్టయితే మానవుడు మృగంగానో, పిశాచంగానో మారిపోతాడు. అందువల్ల, జాతి అనుసరించే నియమాలను, చట్టాలను, ప్రభుత్వాలు, చట్టసభలు, న్యాయ స్థానాలు మార్చవచ్చు. ఈ మార్పులు మానవ జీవనంలోని మౌలికస్వభావం మరింతగా అభివృద్ధి చెందటానికి సహాయపడాలిగాని మానవులు మృగాలు గా, పిశాచాలుగా రూపాంతరం చెందడానికి తావీయకూడదు.
లక్షణాల రీత్యా మానవుడు ఒక జంతువే. కాకపోతే మిగిలిన జంతువుల కంటే మానవులు వైవిధ్యానికి కారణం విచక్షణా ఙ్జాన్ కలిగి ఉండటమే. ఆ విచక్షణ ద్వారా నిర్దేశించుకున్న విభిన్న నియమాలతో జాతులు జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. వ్యభిచరించడం నేరమని, పాపమని, సామాజిక విద్రోహమని, మౌలిక మానవ స్వభావానికి విరుద్దమని యుగయుగాలుగా సాంప్రదాయాల రూపంలో జాతి గమనం నిర్దేశించబడుతూ వస్తుంది. యుగకర్తలు అప్పుడప్పుడు జన్మించి భారత జాతీ విచక్షణ ఙ్జానాన్ని గుర్తుచేస్తూ ఉండటం అనేకసార్లు నిరూపించింది, నిర్దేశించింది, ధ్రువపరచింది, నిర్థారించింది.
ఈ విచక్షణ నుండి ఉద్భవించిందే వివాహం! వైవాహిక ధర్మం పాటించే స్త్రీ పురుషులు శృంగార లైంగిక కలాపంతో సంతానం పొందుతూ జాతిని కొనసాగించటం మానవధర్మం. అదే మానవత్వం. వివాహబంధం లేని స్త్రీ పురుషులు లైంగిక శృంగార కలాపం జరపడం తృష్ణ తీర్చుకోవటం వరకే పరిమితమైన మృగ స్వభావం! అందువల్ల లైంగిక శృంగారం వివాహ బంధం పరిధికి పరిమితం కావాలన్నది భారతీయ జీవన విధానంలో మిళితమైన గుణం.
ఈ పరిమితిని అతిక్రమించడం వ్యభిచారం. ఈ నిభందనకు లోబడి ఉండటమే దాంపత్యం! భారతీయ శిక్షాస్మృతి లోని ఈ 497వ ‘నిబంధన’ స్వాతంత్ర భారతంలో ఇన్నేళ్ళు గా ఈ కుటుంబ వ్యవస్థ పరిరక్షణకు దోహదం చేసింది. మృగ స్వభావమైన వ్యభిచారాన్ని నిరోధించ డానికి నియంత్రించడానికి దోహదం చేసింది. కానీ సర్వోన్నత న్యాయస్థానం ఈ ‘నిబంధన’ రాజ్యాంగ విరుద్ధమని నిర్ధారించింది. వ్యభిచారం నేరం కాదని పరోక్షంగా తీర్పు చెప్పింది!
వ్యభిచారాన్ని నేరంగా పరిగణనిస్తున్న చట్టంలోని ఈ నిబంధన పురుషుల అక్రమ ఆధిక్యతకు, మహిళల పట్ల వివక్షకు ఉదాహరణ అని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడం విచిత్రం. ఈ నిబంధన, ఇతర నిబంధనల ప్రకారం వివాహిత మహిళతో "ఆమె భర్త కాని" పురుషుడు లైంగిక శృంగారం జరపడం అంటే పర స్త్రీని సంభోగించటం వ్యభిచారం క్రిందకే వస్తుంది కదా! జాతి సనాతన కాలం నుండి భావించే వ్యభిచరించడం నేరం - ఈ నేరం చేసిన పురుషుడు శిక్షార్హుడు. అందు వల్ల, ఈ నిబంధన పురుషుని ఆధిక్యతకు కానీ అక్రమ ఆధిపత్యానికి కానీ ఎలా దోహదం చేసిందన్నది సామాన్య జనానికి అర్థం కాని విషయం.
-"తన భార్య కాని - పరుని భార్య అయిన" మహిళతో లైంగిక కలాపానికి పాల్పడిన వ్యభిచార పురుషుడిని శిక్షించడం, న్యాయ స్థానాలలో నిలబెట్టి విచారించడం మహిళల పట్ల వివక్ష చూపడం ఎలా ఔతుంది?
-ఈ నిబంధన మహిళలకు పురుషులతో ఉన్న సమానత్వానికి భంగకరం ఎలా అయింది?
-ఇప్పుడు ఈ నిబంధనను సుప్రీంకోర్టు రద్దు చేయడంవల్ల, వ్యభిచారం చేయడం నేరం కాదని తప్పు కాదని తీర్పు చెప్పడంవల్ల మహిళలకు న్యాయం జరుగుతుందా?
-మహిళా సాధికార ప్రక్రియ వేగవంతం అవుతుందా?
-సామాన్య ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్న ఈ తీర్పును గురించి సర్వోన్నత న్యాయస్థానం వారు తక్షణం తమంత తాముగా (సూమోటో) సమీక్షించాలి!
-ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడి లైంగిక శృంగార క్రియ లో పాల్గొంటే తప్పు లేదన్నది సుప్రీం కోర్టు చేసిన నిర్ధారణ తీర్పు. ఇలా "పాల్గొనడం తప్పు - నేరం!" అని నిర్ధారించిన చట్టంలోని నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయ మూర్తులు నిర్ధారించి, ఆ నిబంధనను రద్దు చేశారు. అందువల్ల పరస్పరం ఇష్టం పడే స్త్రీ పురుషులు స్వేచ్ఛగా-నైతిక నియమాలతో సామాజిక సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా–వ్యభిచరించ వచ్చునట!
-కానీ ఈ పరస్పరం ఇష్టపడే స్త్రీ పురుషులు వివాహంతో నిమిత్తం లేకుండా స్వేచ్ఛగా "సహజీవనం" చేయవచ్చునని సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే నిర్ధారించింది. ఆ విధంగా జనాభాలో కొందరైనా వివాహం చేసుకొనకుండానే ఇప్పటికే లైంగిక సహజీవనం చేస్తున్నారు. కానీ ఈ "పరస్పరం ఇష్టపడడం" వివాహబంధానికి బద్ధులైన వారికి కూడా వర్తింప చేయడం నేటి తీర్పు. పరస్పరం ఇష్టపడడం అన్నది వివాహానికి ప్రాతిపదిక.
-పరస్పరం ఇష్టపడడం "స్వయంవరం" కావచ్చు లేదా తల్లిదండ్రుల, పెద్దల నిర్ధారణవల్ల కావచ్చు. స్త్రీ పురుషులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. అందువల్ల "పెళ్లి" మాధ్యమంగా స్త్రీ పురుషులు పరస్పరం ఇష్టపడి ఆ జీవనం లైంగిక శృంగార కలాపాలను నిర్వహిస్తున్నారు. ఇలా పెళ్లికి కుటుంబ వ్యవస్థకు మూలాధారమైన "పరస్పర ఇష్టాన్ని" సుప్రీం కోర్టు వారు వ్యభిచారానికి కూడా వర్తింప చేశారు. ఇలా వర్తింప చేయడం భారతజాతీయ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రాతిపదిక అయిన ‘కుటుంబ వ్యవస్థ’ కు గొడ్డలిపెట్టు.
-వివాహిత పురుషుడు, వివాహిత మహిళ, భార్య తోను భర్త తోను ఇష్టపడి లైంగిక శృంగారాన్ని నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు ఈ వివాహిత స్త్రీ భర్త కాని పురుషుడి తోను, వివాహిత భర్త మరొక భార్య కాని మహిళతో ఇష్టపడి లైంగిక శృంగారం నిర్వహించడం ఏమిటి?
-వివాహం ద్వారా ‘నాతిచరామి - ఇతరులతో ధర్మం అర్థం కామం మోక్షం నెఱపను" - అని భర్త భార్యకు - "నాతి చరితవ్య - వాటికి పాల్పడను " అని భార్య భర్తకు హామీ ఇస్తున్నారు. అందువల్ల ఈ ప్రతిజ్ఞాబద్ధులైన భార్యభర్తలు మరొకరితో "ఇష్టపడి లైంగిక కలాపం జరపడం" వివాహ విశ్వాసానికి విఘాతకరం కాదా! దాంపత్య ధర్మంతో విలసిల్లే జాతి సనాతన గృహాశ్రమ ధర్మానికి ద్రోహం కాదా!
-వ్యభిచారం చేసిన భాగస్వామి నుండి విడాకులు పొందే హక్కు భార్యకు భర్తకు ఉన్నదని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది. విడాకులు పొందడానికి అతి సులభమైన మాధ్యమం "వ్యభిచారక్రియ". అదే ప్రాతిపదిక అయినప్పుడు అది తప్పు కాకుండా ఎలా పోతుంది? అది ఒక వేళ నేరం కానట్టయితే వివాహ విచ్ఛిత్తికి, విడాకులకు అది ఎలా ప్రాతిపదిక అవుతుంది?
-ఈ విచిత్ర న్యాయనిర్ణయాన్ని సమూలంగా తొలగించటానికి వీలుగా పార్లమెంటు వెన్వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలి! ప్రజలు ప్రజాస్వామ్యంలో సర్వాధికారులు. వ్యభిచారం నేరమన్నది అత్యధిక ప్రజల అభిప్రాయం.
సెక్షన్ 497 ను కొట్టివేసే క్రమంలో జస్టిస్ డివై చంద్రచూడ్ గతంలో తన తండ్రి, మాజీ చీఫ్ జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా తీర్పు నిచ్చారు. రానున్న ఈ సాంఘిక అరాచకాన్ని ఉపద్రవాన్ని ముందుగా ఊహించే 33 ఏళ్ల క్రితం సీనియర్ చంద్రచూడ్ తీర్పు చెబుతూ సెక్షన్ 497 ను పరిరక్షిస్తూ సమర్ధిస్తూ - అన్ని వివాహేతర సంబంధాలు కాకపోయినప్పటికీ కొన్ని మాత్రం నేరాలుగా పరిగణించా ల్సిందేనని చెప్పారు.
కానీఇటీవల (జూనియర్) డివై చంద్రచూడ్ మాత్రం తండ్రి తీర్పుతో విబేధిస్తూ అసలు అక్రమ సంబంధాలు నేరపూరితం కాదని పేర్కొన్నారు. అంతేకాదు పైళ్ళైన మహిళ కేవలం తన భర్త తోనే శృంగారంలో పాల్గొనాలని రూలు లేదని, ఆమె ఒక స్స్థి కాదని అందుకే భర్త సొత్తు కాదని అభిప్రాయ పడ్డారు. ఆమెకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.
దీంతో కొన్ని నీతి నియమాలు పాటించని అసాంఘిక శక్తులు సామాజిక అరాచకాన్ని సృష్టించే అవకాశం ఉంది. న్యాయమూర్తు లైన తండ్రీ కొడుకులే ఈ విషయంలో ఇంత విభిన్నమైన తీర్పులు ఇచ్చినప్పుడు - సామాన్యుడు ఈ సమాజంలో వైవాహిక జీవితం నెరపగలడా? అసాంఘిక శక్తులు విజృంభించవా? అందుకే ఈ ప్రజాస్వామ్య రాజ్యంలోని కేంద్ర చట్టసభ అంటే పార్లమెంట్ ఈ చట్టనికి వెంటనే సవరణ చేయక పోతే భారత దేశ సహజ స్వభావమైన వివాహ వ్యవస్థ అంతరించే ప్రమాదం ఉంది.