ఈ మద్య తెలిసీ తెలియని వయసులో తీసుకుంటున్న నిర్ణయాలు కన్న తల్లిదండ్రులకు విషాదాన్ని మిగులుస్తున్నాయి. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం తెలిసిందే..తొమ్మిదవ తరగతిలోనే ప్రేమ మొదలు పెట్టి ఇంజనీరింగ్ పూర్తి కాకముందే పెళ్లి చేసుకున్న ప్రణయ్, అమృతల ప్రేమ విషాదంతో ముగిసింది. ఎర్రగడ్డ లో జరిగిన హత్యా ప్రయత్నంలో కూడా ఇద్దరు ప్రేమికులు డిగ్రీ చదువుతున్నారు..ప్రేమించుకున్నామన పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. దాంతో యువతి తండ్రి కూతురు పైదాడి చేయడం సంచనలం రేపింది.
తాజాగా ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించి..తమ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పలేక..ఒకవేళ తమ విషయం పెద్దలకు, స్కూల్ యాజమాన్యానికి తెలిస్తే..ఏం జరుగుతుందో అని భయపడి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జగిత్యాలలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే మహేందర్, రవితేజ అనే విద్యార్థులు ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు.
ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించడంతో వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి స్నేహితులు ఇద్దరూ కలిసి మద్యం సేవించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అనంతరం ఇద్దరి మధ్య మరోమారు అమ్మాయి విషయం ప్రస్తావనకు రావడం..మాట మాటల పెరగడంతో..ఇద్దరూ తాము తెచ్చుకున్నపెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు.
మహేందర్ అక్కడికక్కడే చనిపోగా, రవితేజ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే ఇద్దరు విద్యార్థులు చనిపోయే ముందు వారితో మరొక విద్యార్థి ఉన్నాడా..నిప్పంటించుకునే సమయానికి అక్కడ నుంచి పారిపోయాడా..? వారికి పెట్రోలు ఎక్కడి నుంచి వచ్చింది? వారే నిప్పంటించుకున్నారా? లేక, మరెవరైనా ఆ పనిచేశారా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సంఘటన ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది..అనేది తెలియక ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.