రైతు రుణమాఫీ, నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకు అందించాలనే ప్రధాన డిమాండ్లతో వేలాది రైతులు ఘజియాబాద్లో మంగళవారం కదం తొక్కారు. దాదాపు 30వేల మంది రైతులను పోలీసుల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పది రోజులుగా మహా పాదయాత్ర చేపట్టి దిల్లీకి చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. రైతులంతా హరిద్వార్ నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు కోరుతూ రైతులు పోరుబాట చేపట్టారు.అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత నరేశ్ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఇక్కడ(దిల్లీ-యూపీ సరిహద్దు) ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్కో లేదా బంగ్లాదేశ్కో వెళ్లిపోవాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రైతుల్ని బుజ్జగించేందుకు యూపీ మంత్రులు ప్రయత్నాలు చేసినప్పటికీ మంత్రుల మాటలకు విసుగెత్తిన రైతులు, ఢిల్లీ వైపు అడుగులు వేశారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కిసాన్ క్రాంతి యాత్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. మరోవైపు కాగా ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని దిల్లీ పోలీసులు చెప్తున్నారు. అయితే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైతులను నగరంలోకి ప్రవేశించనివ్వండి... వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు.వారిని అడ్డుకోవడం తప్పని పేర్కొన్నారు.
కాగా, పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి సెప్టెంబరు 23న కిసాన్ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల మీదుగా అక్టోబరు 2న దిల్లీలోని కిసాన్ ఘాట్కు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. రైతుల ఆందోళన కారణంగా మీరట్ ఎక్స్ప్రెస్వే పైకి వెళ్లొద్దని పోలీసులు ద్విచక్రవాహనదారులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.